కరణ్ జోహర్ ‘ధర్మ’ను తప్పుపట్టిన ఎయిర్ఫోర్స్.. గుంజన్ సక్సేనా మూవీపై ఫిర్యాదు
భారతీయ వైమానిక దళంలో తొలి పైలెట్ గుంజన్ సక్సేనా జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన గుంజన్ సక్సేనా: ది కార్గిల్ వార్ అనే చిత్రంపై ది ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల చిన్నచూపు చూస్తారు.. వారిపై వివక్ష చూపిస్తూ వేధిస్తారు అనే విధంగా సినిమాను తెరక్కించారు అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారులుకు ఫిర్యాదు చేశారు. ఎయిర్ఫోర్స్ ప్రతిష్టను పెంచే విధంగా, భావి తరం మహిళలకు స్ఫూర్తిగా నిలిచేలా సినిమాను తెరకెక్కిస్తామని చేసుకొన్న అవగాహనకు భిన్నంగా ధర్మ ప్రొడక్షన్స్ సినిమాను తీసిందనే అసంతృప్తిని ఎయిర్ఫోర్స్ అధికారులు వ్యక్తం చేశారు.
వెండితెరపై మాజీ ఫ్లయిట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా క్యారెక్టర్ను అద్భుతమైన కీర్తిని ప్రతిబింబిచేలా చిత్రీకరిస్తామని అనుకొన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎయిర్ఫోర్స్ విభాగం పనితీరుపై మచ్చ తెచ్చే విధంగా సీన్లను చిత్రీకరించారు. అలాంటి సన్నివేశాలు వైమానిక దళ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది అని అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతీయ వైమానిక దళంలో వివక్ష ఉందనే తప్పుడు భావన కల్పించే విధంగా సీన్లు, కథను రాశారు. మాకు అందించిన స్క్రిప్టుకు భిన్నంగా తెరకెక్కించారు అని ఫిర్యాదులో పేర్కొంటూ కథకు సంబంధించిన స్క్రిప్టును అందజేశారు. వైమానిక దళంలో లింగ వివక్ష ఉండదు. మహిళలకు, పురుషులకు సమానత్వానికి పెద్ద పీట వేస్తాం. స్త్రీ, పురుష బేధాలు లేకుండా సమాన అవకాశాలు కల్పిస్తుంది అని అధికారులు పేర్కొన్నారు.

1999 సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా చూపిన ధైర్య సాహసాల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. కార్గిల్ యుద్దంలో విశేష సేవలందించినందుకు గాను గుంజన్ సక్సేనాను శౌర్య వీర్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఎయిర్ఫోర్స్ అధికారులు ఫిర్యాదు చేయడం వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











