IBOMMA ఓనర్ అరెస్ట్.... పోలీసులకే సవాల్ విసిరి, ఇలా దొరికిపోయి
చిత్ర పరిశ్రమకు ప్రతియేటా వేల కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తోంది పైరసీ మాఫియా. గతంలో కొత్త సినిమాలు రిలీజైన వెంటనే పైరసీ ప్రింట్లు డీవీడీల రూపంలో బ్లాక్లో దొరికేవి. ఇప్పుడు ఆధునిక యుగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో రావడంతో పైరసీ చేసే విధానం ఊహాకు కూడా అందని విధంగా మారిపోతోంది. థియేటర్లో మార్నింగ్ షో ముగిసేసరికి హై క్వాలిటీతో కూడిన కంటెంట్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. సినీ పరిశ్రమ, పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పైరసీ ముఠాలు సవాల్ విసురుతూనే ఉన్నాయి.
కాగా.. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు పలు భాషలకు చెందిన పైరసీ వీడియోలను ప్రసారం చేస్తోన్న IBOMMA వెబ్సైట్ జనానికి బాగా నోటెడ్ అయ్యింది. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు థియేటర్కు కాకుండా ఐబొమ్మలో వెతుక్కుంటున్నారంటే ఈ వెబ్సైట్ ఏ రేంజ్లో విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హై క్వాలిటీ, హెచ్డీ ప్రింట్లు ఈ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి, ఎన్నో వ్యయప్రయాసలు పడి తీసిన సినిమాలు ఇలా నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో దర్శక నిర్మాతలు తల పట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలను పైరసీ చేస్తోన్న ఐ బొమ్మ వెబ్సైట్పై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐ బొమ్మ కోసం పనిచేస్తున్న పలువురు ఏజెంట్లను అరెస్ట్ చేసి జైళ్లో వేసింది. థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేస్తున్న వారిని, సర్వర్లు హ్యాక్ చేస్తోన్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. అయితే తమ దందాకు అడ్డొస్తున్న పోలీసులకు ఐ బొమ్మ వార్నింగ్ ఇచ్చింది.
తమ వెబ్సైట్ను టచ్ చేస్తే ఘోర పరిణామాలు తప్పవని పోలీసులు, మీడియా, ఓటీటీ సంస్థలు, చిత్ర పరిశ్రమను హెచ్చరించింది. 5 కోట్ల మంది యూజర్లకు సంబంధించిన డేటా మా దగ్గర ఉందని.. అది లీక్ చేస్తే మీడియా, ఓటీటీలు, హీరోలకు సంబంధించిన వివరాలు బయటపడతాయని హెచ్చరించింది. మేమే ఏ ఒక్క దేశానికి పరిమితం కాలేదు.. గ్లోబల్ నెట్వర్క్ అని హెచ్చరించింది. మేం ఏ దేశంలో ఉన్నా భారతదేశం, ముఖ్యంగా తెలుగువారి కోసం ఆలోచిస్తామని ఐబొమ్మ తెలిపింది.
ఐ బొమ్మ వార్నింగ్తో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. కరేబియన్ దీవుల్లో సర్వర్లను ఏర్పాటు చేసి ఈ వెబ్సైట్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్లను మారుస్తూ పోలీసులను మరింత ఇబ్బంది పెట్టారు. అయితే పోలీసులు తెలివిగా వ్యవహరించడంతో వీరి గుట్టు తెలిసిపోయింది. నాటి నుంచి ఈ ముఠా కదలికలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తూ, సైలెంట్గా తమ పనిచేసుకుపోయారు.
తాజాగా ఐ బొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 15వ తేదీన అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా రవిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అతని ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











