డ్రగ్స్ వాడినట్లు తేలితే బహిష్కరణే.. టాలీవుడ్ స్టార్స్కు దిల్రాజు మాస్ వార్నింగ్
డ్రగ్స్ కేసులో తమిళ నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ అరెస్ట్ కావడంతో చిత్ర పరిశ్రమ మరోసారి ఉలిక్కిపడింది. టాలీవుడ్ టూ బాలీవుడ్లలో మాదక ద్రవ్యాల వినియోగంపై చర్చ జరుగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్లలో గతంలో డ్రగ్స్ దందాలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు నటులపై కేసులు, సిట్ ఎంక్వైరీలు, ఆ తర్వాత క్లీన్చీట్లు నడిచి ఇండస్ట్రీ పరువు గంగపాలైన ఉదంతాలెన్నో. అడపా దడపా ఎవరో ఒక సెలబ్రెటీ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూ ఉంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అరెస్ట్ తర్వాత చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిత్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
చాక్లెట్లలో డ్రగ్స్ విక్రయాలు
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తాను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యే వాడినని గుర్తుచేసుకున్నారు. కానీ పాఠశాలలు, విద్యాసంస్థల పరిసరాల్లోనే డ్రగ్స్ అమ్ముతున్నారని వార్తలు చూసి బాధపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఒక తండ్రిగా రాష్ట్రం గురించి, నగరం గురించి, స్కూల్స్ గురించి ఆలోచించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

స్కూల్కి పంపాలంటేనే భయమెస్తోందన్న చరణ్
మా చిన్నప్పుడు స్కూల్ బయట గోలీ సోడాలు ఉండేవని, ఇప్పుడు పిల్లలకు చాక్లెట్లు, ఐస్క్రీమ్లు కొనివ్వాలంటేనే భయపడే పరిస్ధితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు అందరూ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని రామ్ చరణ్ కోరారు. మనల్ని మనమే బాగు చేసుకుందాం.. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్ను నిర్మూలిద్దామని చరణ్ సూచించారు. ఫ్రెండ్స్తో కలిసి సాయంత్రం ఆడుతుంటే ఎంతో బాగుంటుందని .. కుటుంబంతో హ్యాపీగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశాన్ని నాశనం చేస్తున్నారన్న విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తనకు బయట జరిగే విషయాలు పెద్దగా తెలియవని, ఎందుకంటే నేను చిన్న ప్రపంచంలో బతుకుతుంటానని అన్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన సదస్సులో పాల్గొనమని ఓ పోలీస్ అధికారి అడగటంతో ఆయన కోసం ఓ బైట్ ఇచ్చానని విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ గురించి ఏకంగా ఇంటర్నేషనల్ డే ఉందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా దీనిపై మాట్లాడాలని అనిపించిందని అని ఆయన వెల్లడించారు. దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని.. వాటి జోలికి వెళ్లొద్దని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.
డ్రగ్స్ వాడితే నిషేధమన్న దిల్రాజు
దిల్రాజు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తాను ఓ రోజున ఫ్లైయిట్లో వెళ్తుండగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలని నాతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇది 9 నెలల క్రితం జరిగిన సంఘటన అని, డ్రగ్స్ వల్ల పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతాయి.. మనం వీటిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎంగారికి చాలా వివరంగా చెప్పానని దిల్రాజు తెలిపారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, పరిచయస్తులు ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకోకుండా నేను చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
నాలాగే మీరంతా కూడా ప్రతిజ్ఞ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయగలమని దిల్రాజు అభిప్రాయపడ్డారు. ఈ మధ్యే మలయాళం చిత్ర పరిశ్రమలో ఒక నిర్ణయం తీసుకున్నారని.. ఆ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే ఆ పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమను కూడా నేను కోరుకునేది ఒక్కటే.. డ్రగ్స్ తీసుకున్నట్లు ఎవరైనా తేలితే అలాంటి వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తే సమాజానికి కూడా ఒక మెసేజ్ వెళ్తుందన్నారు. ఎఫ్డీసీ నుంచి టాలీవుడ్ పెద్దలతో మాట్లాడి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ నిర్ణయం అమలు జరిగేలా చేస్తామని దిల్రాజు తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











