అల్లు అర్జున్ ను లైట్ తీసుకున్న నిహారిక..మెగా డాటర్ కావాలనే ఇలా చేసిందా?
మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు వచ్చాయని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్నాళ్ళ నుంచో వినిపిస్తున్న రూమరే అయినప్పటికీ, ఇటీవల కాలంలో బాగా గట్టిగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత అది మరింత ముదిరింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన పార్టీకి కాకుండా, తన స్నేహితుడైన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం జనసేన కార్యకర్తలకు, మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూ, దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా కుటుంబ సభ్యులు సైతం అల్లు అర్జున్ ను తమ ఫ్యామిలీలో భాగంగా చూడటం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వెళ్లి వైయస్సార్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డికి సపోర్ట్ చేసి వచ్చారు. ఆ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు 'మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే' అంటూ ఎక్స్ లో పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఇది మెగా Vs అల్లు విభేదాలకు ఆజ్యం పోసినట్టు అయింది. కొంతసేపటికే ఆ పోస్టు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే నెట్టింట వైరల్ అయిపోయింది. దీనికి తోడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీ దంపతులను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది. లేటెస్టుగా 'కమిటీ కుర్రోళ్ళు' ఈవెంట్ లో నిహారిక స్పీచ్ చూస్తే, మెగా ఫ్యామిలీ కావాలనే అల్లు అర్జున్ని ఇగ్నోర్ చేస్తోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నిహారిక కొణిదెల తన హోమ్ బ్యానర్ లో రూపొందించిన మొదటి ఫీచర్ ఫిల్మ్ 'కమిటీ కుర్రోళ్ళు'. అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా డాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలో తమ ఫ్యామిలీకి అంతాబాగా జరుగుతోందని చెప్పిన నిహారిక.. "మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్ కి వెళ్లింది. మా పెదనాన్నకి పద్మ విభూషణ్ వచ్చింది. మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు. నిర్మాతగా నా తొలి చిత్రాన్ని సక్సెస్ చెయ్యండి ప్లీజ్" అంటూ మాట్లాడింది. కానీ ఇక్కడ టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ పేరుని మాత్రం ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో బన్నీని మెగా ఫ్యామిలీలో భాగంగా చూడటం లేదా? నిహారిక కావాలనే అల్లు అర్జున్ పేరుని ప్రస్తావించ లేదా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల నిహారిక ఓ ఇంటర్వ్యూలో నాగబాబు డిలీట్ చేసిన పోస్టుపై స్పందించింది. సోషల్ మీడియాలో తన తండ్రి ఎప్పుడూ ఏదోకటి పోస్ట్ చేస్తూ ఉంటారని, ట్విట్టర్లోనే కాదు వాట్సాప్లో రోజూ ఒక సూక్తి పెడుతుంటారని తెలిపింది. ఆయన ఆరోజు పోస్ట్ చేసిన దానికి రీజన్ ఏంటనేది తెలియదని, ఇంట్లో ఆ టాపిక్ గురించి చర్చ జరగలేదని చెప్పింది. అయినా ఎవరు ఏ పని చేసినా ఎవరి కారణాలు వాళ్లకి ఉంటాయని, అన్ని విషయాల్లో అందరూ ఒకే విధంగా ఉండాలని లేదని అభిప్రాయ పడింది. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎవరి ఇష్టం వాళ్లదని, ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేయొచ్చని చెప్పింది. తన వరకూ ఫ్యామిలీకే మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చింది.

అంతకముందు ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలను సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంపై నిహారిక స్పందించింది. ఆ విషయం తనకు తెలియదని, ఏం చేసినా ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయని చెప్పి తెలివిగా సమాధానమిచ్చింది. ఇదిలా ఉంటే నాగబాబు రీసెంట్ గా ఇన్స్టా చిట్ చాట్ లో బన్నీ గురించి ప్రస్తావించారు. 'అల్లు అర్జున్ సంగతేంటి బాబాయ్' అని ఓ నెటిజన్ అడగ్గా.. 'పుష్ప 2' కోసం ఎదురు చూస్తున్నాని బదులిచ్చారు. బన్నీ గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. బాగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పారు. దీంతో మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య అంతా సర్దుకుంటోందని, త్వరలోనే ఎప్పటిలాగే కలిసిపోతారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











