సాయిధరమ్ తేజ్పై కూడా దాడి.. దద్దమ్మలం కాదు.. ఎందుకు ఉరుకొన్నామంటే.. వర్మ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఆ రెండు గ్రూపుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా గొడవలకు తెరలేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఎస్వీఎస్ఎన్ వర్మపై కొందరు ఇటీవల టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన కార్యకర్తలు దాడి చేయడం సంచలనం రేపింది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. బయటపెట్టిన విషయాలు దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
నాపై, మా పార్టీ ప్రధాన నాయకులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో కొందరిపై హత్యప్రయత్నం చేశారు. ఈ ఘటనకు జనసేన, పవన్ కల్యాణ్కు ఎలాంటి సంబంధం లేదు. ఈ దాడిపై మేము పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అలాగని మేము దద్దమ్మలం కాదు. చేతులు ముడుచుకు కూర్చోలేదు అని వర్మ అన్నారు.

మాపై దాడి పోలీసుల ప్రోద్బలంతోనే జరిగింది. వారి సమక్షంలోనే దాడి చేశారు. అయితే పవన్ కల్యాణ్ నాకు బాధ్యత అప్పజెప్పారు. దాంతో రకరకాల వ్యూహాలతో మేము ఎలక్షన్ చేశాం. విజయం సాధించాం. ఇది గిట్టని కొందరు ముఖ్యంగా తాజా ఎంపీ వర్గంలోని కొందరు నాపై దాడికి పాల్పడ్డారు అని సంచలన ఆరోపణలు చేశారు.
నాపైనే కాదు.. ప్రచారంలో సాయిధరమ్ తేజ్పై కూడా దాడి చేశారు. అప్పుడు పోలీస్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ధరమ్ తేజ్ వెళ్లిపోయిన తర్వాత దాడి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేశారు. అయినా మేము ఆ దాడిని ఖండించలేదు. ఎన్నికల తర్వాత చూసుకొందామని వదిలేశాం అని వర్మ తెలిపారు.

ఇప్పటి వరకు పిఠాపురంలో దాడి సంస్కృతి లేదు. నన్ను చంపాడానికే ఈ దాడి చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. చట్టాలు ఉన్నాయి. అవి తమ పని చేసుకొంటూ పోతాయి. మా అధిష్టానానికి మేము ఫిర్యాదు చేశాం. వారి ఆదేశాల ప్రకారం మేము పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని అన్నారు.
అయితే జనసేనకు, తమ మామయ్యకు ప్రచారం చేస్తున్న సమయంలో సాయిధరమ్ తేజ్పై దాడి జరిగిందనే విషయాన్ని వర్మ బయటపెట్టడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు జరిగాయా? అనేది దిగ్బ్రాంతిని కలిగిసున్నాయి అని జనసైనికులు, మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











