SSMB28: మహేశ్ బాబుకు విలన్ తెలుగు హీరోనే.. పొరపాటున లీక్ చేసిన నిర్మాత
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని.. దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరో స్టేటస్తో దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అంతేకాదు, హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో విజయాల పరంపరతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమాను చేస్తోన్నాడు. 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ మూవీల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేసుకున్నారు. అలాగే, రెండో షెడ్యూల్ను కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. ఇక, ప్రస్తుతం మహేశ్ బాబు వెకేషన్కు వెళ్లగా.. యూనిట్ మాత్రం హైదరాబాద్లో భారీ సెట్ను నిర్మించే పనిలో ఉంది. ఇది పూర్తైన వెంటనే షూట్ మొదలెట్టి.. ఏకధాటిగా మొత్తం కంప్లీట్ చేసే ప్లాన్ చేసుకున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో మహేశ్ బాబును ఢీకొట్టే విలన్ పాత్రను ఎవరు చేస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సంజయ్ దత్, పృథ్వీరాజ్ సుకుమారన్, సముద్రఖని సహా ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో తెలుగు సీనియర్ హీరో జగపతి బాబు మెయిన్ విలన్గా నటిస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ రివీల్ చేశారు. అంతేకాదు, జగ్గూ భాయ్ పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని కూడా వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. దీన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











