ఆ హీరో పోస్టర్లు చింపేసిన దళపతి విజయ్ ఫ్యాన్స్... జన నాయగన్ రిలీజ్ వేళ వివాదం
భారత్లో సినీతారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమాన తారలను దేవుళ్లుగా పూజిస్తారు ఫ్యాన్స్. వారికి ఏ కష్టం వచ్చినా తమ కష్టం అనుకున్నట్లుగా భావిస్తారు. ఇక వ్యక్తిపూజ ఎక్కువగా ఉండే తమిళనాడులో స్టార్ల క్రేజ్ పీక్స్లో ఉంటుంది. ఈ స్థాయిలో అభిమానం చూపించే వాళ్లు ఉండటంతో అక్కడ ఫ్యాన్ వార్లు కూడా ఎక్కువ. భౌతికదాడుల నుంచి హత్యల స్థాయికి తమిళనాడులో ఫ్యాన్ వార్స్ చేరుకున్నాయి. థియేటర్లలో పరస్పరం కొట్టుకోవడం, రికార్డుల గురించి సోషల్ మీడియాలో రచ్చ సరేసరి.
తమిళనాడ ఓ స్టార్ హీరో సినిమా విడుదల అవుతుందంటేనే సందడిగా ఉంటుంది. అలాంటిది ఒకేసారి ఇద్దరు అగ్రనటుల సినిమాలు రిలీజ్ అయితే ఆ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దళపతి విజయ్, తలా అజిత్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ పీక్స్లో ఉంటుంది. రెండు వర్గాలు ఎప్పుడూ బద్ధ శత్రువులుగా కొట్టుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు అగ్రనటుల సినిమాలు విడుదలయ్యే సమయంలో పోలీసులు టెన్షన్ టెన్షన్గా గడుపుతుంటారు.

తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల కానుండటంతో చిత్ర పరిశ్రమ, పోలీస్ వర్గాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. సూపర్స్టార్, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ జనవరి 9న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. తన సినీ జీవితంలో ఇదే చివరి చిత్రమని మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ వేడుకలో స్వయంగా దళపతి ప్రకటించడంతో జన నాయగన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడులో విజయ్ ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో ఆయనకు అదిరిపోయేలా వీడ్కోలు పలికేందుకు అభిమానులు, టీవీకే కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఊరువాడా కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
జన నాయగన్ విడుదలైన నాలుగు రోజుల గ్యాప్లో కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్ నటించిన పరాశక్తి రిలీజ్ కానుంది. పీరియాడికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాపైనా చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భారీ చిత్రాలు రోజుల గ్యాప్లో బరిలో నిలవడంతో బాక్సాఫీస్ వద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంది. విజయ్ ఫ్యాన్స్, శివకార్తీకేయన్ ఫ్యాన్స్ దీనిని వ్యక్తిగతంగా తీసుకుని తమ హీరో సినిమా హిట్ అంటే.. లేదు మా హీరో సినిమాయే హిట్ అంటూ మధ్య సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. తాజాగా ఈ గొడవ రోడ్డునపడింది.
జన నాయగన్ ట్రైలర్ను జనవరి 3వ తేదీన మేకర్స్ విడుదల చేశారు. తమిళనాడులోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్లో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంతో థియేటర్లకు విజయ్ అభిమానులు పోటెత్తారు. వారు విజయ్ పాటలతో డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. అలా మధురైలోని ఓ థియేటర్లోనూ ఇదే విధంగా పండుగ చేసుకున్నారు. అయితే ఆ సమయంలో శివకార్తీకేయన్ నటించిన పరాశక్తి సినిమా బ్యాన్సర్స్, పోస్టర్స్ కనిపించడంతో వాటిని విజయ్ అభిమానులు చింపేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పరిస్ధితి ఇప్పుడే ఇలా ఉంటే, రేపు ఒకే థియేటర్లో జన నాయగన్, పరాశక్తి విడుదలైతే మరింత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











