రామోజీరావుకు ఎన్నో వేధింపులు.. మానసిక క్షోభ.. ఇప్పుడా ప్రభుత్వం లేదు .. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు పాత్రికేయ రంగాన్ని సమూలంగా మార్చేసి.. ఛాందసవాద భావజాలానికి చరమగీతం పాడారు రామోజీరావు. క్రమశిక్షణ, కష్టపడటం, కలిసి పనిచేయడమనే సూత్రాలను ఒంటపట్టించుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. చివరి శ్వాస వరకు ఫైటర్గా పోరాడుతూనే, సంపూర్ణ జీవితాన్ని చూశారు.
శనివారం ఉదయాన్నే రామోజీ ఇకలేరన్న వార్తలతో తెలుగు నేల దిగ్భ్రాంతికి గురైంది. ప్రజలు, అన్ని రంగాల ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ జనసంద్రమైంది. రామోజీ రాజీపడని మనస్తత్వాన్ని మెచ్చుకుంటూనే చివరి దశలో ఆయన పడ్డ క్షోభను గుర్తుచేస్తున్నారు. ఎవరు మాట్లాడినా ఈ మాటలే అంటున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ సహా పలు కేసులను రామోజీపై పెట్టిన జగన్ సర్కార్ ఒకానొక దశలో ఆయనను అరెస్ట్ చేయాలని చూసింది. అయితే వయసు , అనారోగ్యం దృష్ట్యా వెనక్కి తగ్గిందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు.

అయితే వైసీపీ సర్కార్ వేధింపులే రామోజీ అనారోగ్యానికి కారణమని.. అందుకే ఆయన ఆరోగ్యం విషమించిందని రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన పలువురు ప్రముఖులు అంటున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. చెత్త రాజకీయాల వల్లే రామోజీరావు చివరి రోజుల్లో మానసిక క్షోభను అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను టార్గెట్ చేయడాన్ని దేవుడు కూడా మెచ్చలేదని అందుకే నిజాన్ని గెలిపించాడని, ఈ ఘన విజయాన్ని చూసిన తర్వాతే రామోజీ భగవంతుడిని చేరుకున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు.
జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. రామోజీ మరణవార్త తెలియగానే సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. అనంతరం రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రామోజీ మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని, ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయనను కలుద్దామనుకున్నానని.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందని పవన్ ఎమోషనల్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినవారేనని పవన్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని.. అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టాయని.. అయినా వాటిని తట్టుకుని నిలబడ్డారని కొనియాడారు. రామోజీని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు లేవని, ఆ విజయాన్ని ఆయనకు తెలియజేయాలని అనుకున్నామని , కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు, ఈనాడు సంస్థల సిబ్బందికి జనసేన తరపున ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ పెట్టిన వేధింపులతో రామోజీ తన చివరి రోజుల్లో ఎంతో ఇబ్బంది పడ్డారని పవన్ కళ్యాణ్ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లైంది. రామోజీ మరణం నేపథ్యంలో ఈ రెండు రోజులు జగన్, వైసీపీలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











