Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ .. ఫ్యాన్స్ వల్లే
హీరోలంటే పడిచచ్చిపోయే అభిమానులు భారతదేశంలో వీధి వీధిలో ఉన్నారు. తమ అభిమాన తారల పుట్టినరోజు నాడు రక్తదానం, అన్నదానం , ఇతర సేవా కార్యక్రమాలతో మంచి చేస్తుంటారు. కానీ వారికి తిక్కరెగితే హీరోలు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఎన్నోసార్లు ఈ అభిమానుల ఓవరాక్షన్ వల్ల హీరోల పరువు బజారున పడింది. తాజాగా ఫ్యాన్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఫ్యాన్స్ అత్యుత్సాహానికి రెండ్రోజుల క్రితం కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ సైతం ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. తలైవా హీరోగా తెరకెక్కిన వేట్టయాన్ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో ఘనంగా జరిగింది. రజనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియో లాంచ్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే ఉద్దేశంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే పాస్లు దొరక్క చాలా మంది బయటే నిల్చొన్నారు.

ఎక్స్ట్రా పాసులు అమ్మడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు నెహ్రూ ఆడిటోరియానికి పోటెత్తారు. దీని వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహించిన నిర్వాహకులు చాలా వరకు అభిమానులను బయటే నిలబెట్టేశారు. ఇది వివాదానికి దారి తీయగా.. అసలు ఎక్స్ట్రా పాసులు ఎవరు విక్రయించారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ వివాదంపై స్వయంగా రజనీ స్పందించారు. ఎక్స్ట్రా పాస్ల అమ్మకంపై కొన్ని ఇబ్బందులు వున్నాయని, దీని వల్ల ప్రేక్షకులు నొచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రజనీ స్పష్టం చేశారు.
తాజాగా కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 22 ఆదివారం హైదరాబాద్ నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటెత్తగా.. వేదిక ఏ మూలకు సరిపోలేదు. ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. బయటే కొన్ని వేల మంది అభిమానులు నిలిచిపోగా.. లోపల గెస్టులు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది.

ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు ఫర్నీచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకు గాయపడినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం అసాధ్యమని భావించిన పోలీసులు, నిర్వాహకులు, నోవాటెల్ సిబ్బంది .. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన నందమూరి అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. ఏర్పాట్లు, వసతులు సరిగా కల్పించకపోవడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.


Click it and Unblock the Notifications











