నా భర్త కోరిక తీర్చకుండానే తిరిగిరాని లోకాలకు.. సత్యనారాయణ మృతిపై కృష్ణంరాజు సతీమణి భావోద్వేగం
నవరస నటనాసార్వభౌమ, లెజండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ మరణవార్త తెలుగు సినీ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దాదాపు 6 దశాబ్దాలపాటు తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేశారు. గత కొద్దికాలంగా వృద్ధాప్యపరమైన వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ విషాదవార్త అన్ని వర్గాలను కలతకు గురిచేసింది. కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

భోజనం చేయాలని ఆహ్వానం
కృష్ణం రాజు సతీమణి ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారని తెలిసి చాలా బాధ పడ్డాం. ఆయన కుటుంబంతో మేమంతా చాలా క్లోజ్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. కృష్ణంరాజు గారు బతికి ఉన్న సమయంలో ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అని ఆహ్వానించారు. కృష్ణంరాజు ఆహ్వాన్ని మన్నించిన ఆయన ఖచ్చితంగా వస్తాను. మీరు ఒక టైం చూసి చెప్పమన్నారు అని సత్యనారాయణ అన్నారు. అయితే ఆయన మా ఇంటికి రాలేక పోయారని ఆవేదన చెందారు.

బొబ్బిలి బ్రహ్మన్నలో కమెడియన్గా
కృష్ణంరాజు గారితో కైకాల సత్యనారాయణ అద్భుతమైన సినిమాల్లో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం, అలాంటి ఒక లెజెండ్రీ నటుడు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడు అంటే అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు అని కృష్ణం రాజు సతీమణి శ్యామల గుర్తు చేసుకొన్నారు.

సినీ పరిశ్రమ దిగ్గజాలు తిరిగిరాని లోకాలకు
నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉంది. ఇదే ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరం అవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల వారి కుటుంబం అంతా దృఢంగా ఉండేలా ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తన ప్రకటనలో శ్యామలదేవి చెప్పారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ఇదిలా ఉండగా, నటుడు సత్యనారాయణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ మేరకు ఓ ప్రకటనలతో తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు, తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజం సత్యనారాయణ అంత్యక్రియలను శనివారం ఉదయం హైదరాబాద్లో నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











