Kalki 2898 AD: నెల్లూరులో అశ్వత్థామ నివసించిన పురాతన ఆలయం.. దారుణమైన స్థితిలో చారిత్రాత్మక కట్టడం
సినిమా అనేది చాలా శక్తవంతమైన సాంస్కృతిక మాధ్యమం. వినోదం అందించేందుకు ఉద్దేశించిన ఈ సాధనం .. సమాజాన్ని అత్యంత ప్రభావితం చేస్తోంది. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలకు సినిమా నాంది పలికింది. ఎన్నో దురాచారాలు, దారుణాలు కళ్లకు కట్టింది వాటిని రూపుమాపడానికి కారణమైంది. భాషలు, భావాలు, భావోద్వేగాలు, సంస్కృతులు, ఆచారాలు ఇలా అన్నింటి గురించి తెలియచేసింది సినిమా. ఛాలెంజ్, స్వయంకృషి సినిమాలు చూసి కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారు ఉన్నారు. కర్తవ్యం చూసి ఆడపిల్లలూ మాకేం తక్కువ అని పొలీస్ ఉద్యోగాలను పట్టుబట్టి సాధించారు.
ప్రస్తుతం లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చిత్ర పరిశ్రమ ఎదిగింది. పూర్తిగా వ్యాపారంగా మారిపోయిన ఇండస్ట్రీలో ప్రజలను చైతన్యపరిచేవి, ఆలోచింపజేసే సినిమాలు అడపాదడపా మాత్రమే వస్తున్నాయి. సినిమాను సరిగా ఉపయోగించుకోగలిగిన ప్రతిభావంతులు ఇంకా రావాల్సి ఉందని విశ్లేషకులు అంటూ ఉంటారు. మెరుగైన సమాజమే ధ్యేయంగా సినిమా పనిచేయాలన్నది పెద్దల మాట.

కాగా.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ మేళవించి సెల్యూలాయిడ్పై అద్భుతాన్ని ఆవిష్కరించారు నాగ్ అశ్విన్. ప్రభాస్ , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణేల నటనకు విజువల్ ఎఫెక్ట్స్ , ఇతర సాంకేతిక హంగులు తోడు కావడంతో కల్కికి ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాడు ప్రభాస్.
అంతేకాదు కల్కిలోని క్యారెక్టర్లు, కథ, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నింటిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక సినిమాకు ఈ స్థాయిలో చర్చ జరిగి చాలా రోజులు అవుతోంది. రకరకాల విశ్లేషణలు, అభిప్రాయాలు, విమర్శలు, ప్రశంసలు ఇలా అన్ని దారులూ కల్కివైపే. ఈ సినిమా పుణ్యమా అని భారతీయుల ఇతిహాసం మహాభారతం, అందులోని క్యారెక్టర్లపై నేటితరం ఆసక్తి కనబరుస్తోంది.
అశ్వత్థామ శాపం, తలపై మణి, కర్ణుడు, అర్జునుడు వంటి పురాణ పాత్రల వ్యక్తిత్వాలపై పెద్దలను అడిగి తెలుసుకుంటున్నారు. మహాభారతంలోని ప్రతి పాత్రా దేనికదే విశిష్టమైనది, దేని ప్రాధాన్యం దానిదే. కొందరు విలన్లుగా కనిపిస్తే, మరికొందరు హీరోలుగా కనిపిస్తారు. ఎన్నో ట్విస్టులు, భావోద్వేగాలు, ఈర్ష్య, అసూయలు, రాజతంత్రం ఇలా ఒక సినిమాకు మించిన సరుకు భారతంలో ఎంతో. అందుకే తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు.
ఇక కల్కి 2898 ఏడీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఓ పురాతన ఆలయం. శాపం తర్వాత ద్వాపర యుగం అంతమైన నాటి నుంచి నేటి వరకు అశ్వత్థామ క్యారెక్టర్ ఈ ఆలయంలోనే ఉన్నట్లుగా నాగ్ అశ్విన్ చూపించారు. దీంతో అసలు ఈ ఆలయం కల్పితమా , లేక భూమ్మీద నిజంగానే ఉందా అని అభిమానులు సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ దేవాలయం భారతదేశంలోనే .. అందులోనే మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే కల్కిలో చూపించిన దేవాలయంగా అందరూ చెబుతున్నారు.
పెన్నా నదీ తీరంలోని ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది. 2020లో చేజర్ల మండలం పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఇసుక కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్టించాడట. 200 ఏళ్ల క్రితం పెన్నానదికి వచ్చిన వరదల్లో ఈ ఆలయం ఇసుక, బురదలో కూరుకుపోయిందట. నాగేశ్వర స్వామి ఆలయానికి వందల ఎకరాల మాన్యం ఉందని రికార్డులు చెబుతున్నాయి.
దీంతో అధికారులు ఇసుక తవ్వకాలను నిలిపివేసి ఆలయాన్ని రక్షిస్తున్నారు. కల్కి సినిమా నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ప్రభాస్ అభిమానులు పెరుమాళ్లపాడుకు పోటెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తానికి ఓ సినిమా కారణంగా ఆలయం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. ప్రభుత్వం కూడా స్పందించి జీర్ణోద్ధరణ పనులు మొదలుపెడితే అంతకన్నా కావాల్సింది ఏముంది.


Click it and Unblock the Notifications











