kalki 2898 ADలో చూపించిన శంభల నగరం ఈ భూమ్మీదే ఉందా..?
మహానటి ఫేం నాగ్ అశ్విన్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే కనివినీ ఎరుగని స్థాయిలో భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగీ. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, శోభన వంటి అగ్రశ్రేణి నటులు ఇందులో భాగమయ్యారు. ఈ విజువల్ ఫీస్ట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్లలోని కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోలు పడ్డాయి. సోషల్ మీడియా సమాచారాన్ని బట్టి కల్కి 2898 ఏడీకి పాజిటివ్ టాక్ నడుస్తోంది.
మహాభారతం , కలియుగం, కల్కి అవతారం చుట్టూ ఈ సినిమాను డిజైన్ చేశారు నాగ్ అశ్విన్. ఇందుకోసం ఆయన ప్రేక్షకులను ఓ మాయాలోకంలోకి తీసుకెళ్లిపోయాడు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కావడంతో అత్యాధునిక టెక్నాలజీ, అడ్వాన్స్ మోడ్లో ఊహాలోకాన్ని ఆవిష్కరించారు. కల్కి కోసం ఏకంగా 5 వీఎఫ్ఎక్స్ కంపెనీలు, హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు భాగమయ్యారు. అందుకే కల్కి కంటెంట్ క్వాలిటీ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన వాళ్లకు శంభల అనే నగరం నిజంగా ఉందా.. లేక నాగ్ అశ్విన్ సృష్టించాడా అనే డౌట్ రావొచ్చు.

ఈ భూమ్మీద మనిషికి అంతు చిక్కని వింతలు, విడ్డూరాలు ఎన్నో . మానవ నాగరికత పురుడుపోసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ మిస్టరీల గురించి మనిషి ఆలోచిస్తూ , కొన్ని ఛేదిస్తూ వచ్చాడు. కానీ అది సముద్రంలో ఇసుక రేణువంత అంటే అతిశయోక్తి కాదు. మానవ మేధస్సుకు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సవాల్ విసిరి సైన్స్కు అందని అంశాలెన్నో. అలాంటి వాటిలో ఒకటి శంభల. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా నేపథ్యంలో ఈ మిస్టరీ సిటీపై మరోసారి చర్చ జరుగుతోంది.
శంభల నగరం ఊహాజనితమైనది కాదని, నిజంగానే ఈ భూమ్మీద ఉందని కొన్ని రచనలు, పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నగరం ఎక్కడో కాదు.. మన భారతదేశానికి సమీపంలోనే, అది కూడా మన హిమాలయాల్లోనే ఉందని అంటున్నారు. విష్ణు పురాణం చదివినవారికి శంభళ గురించి బాగానే తెలుసు. శ్రీమహా విష్ణువు కల్కి అవతారం ఈ నగరం నుంచే మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శంభలను స్వర్గంగా కొన్ని గ్రంథాలు పేర్కొనగా.. హైందవ పురాణాలు మాత్రం దీనిని సిద్ధాశ్రమంగా చెప్పాయి. టిబెట్కు అత్యంత సమీపాన ఈ శంభల ఉంటుందని దీనిని అక్కడి భాషలో షాంగ్రిల్లా అని అంటారట. కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంభల ఉందట.. దీనిని కొందరు మాత్రమే వీక్షించగలరని, సామాన్యులకు అక్కడ ఏం కనిపించదని చెబుతున్నారు.

రామలక్ష్మణులను విశ్వామిత్రుడు యాగం కోసం ఈ శంభల నగరానికి తీసుకెళ్లాడట. మహాభారతంలో పాండవులు కూడా ఈ సిటీని చూసినట్లుగా కొందరు చెబుతున్నారు. అగస్త్యుడు, వశిష్టుడు, మార్కండేయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి పురాణ పురుషులు ఇక్కడే తపస్సును ఆచరించారని అంటున్నారు. కలిపాపాలు పెరిగిపోయి, భూగోళం పాపాల పుట్టగా మారినప్పుడు తాను భరతవంశంలో శంభల అనే నగరంలో విష్ణుయశుడు, సుమతి అనే దంపతులకు జన్మిస్తానని శ్రీమహావిష్ణువు దేవతలకు మాట ఇచ్చారట. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంభల కనిపిస్తుందట. అయితే ఈ కాలంలోనూ కొందరు ఈ నగరంలోకి ప్రవేశించి, అక్కడి అద్భుతాలను కన్నులారా వీక్షించారట.
ఆనందమయి అనే ఆమె తాను హిమాలయాల్లో 20 నుంచి 25 అడుగుల ఎత్తయిన మనుషులను చూశానని వారంతా ద్వాపరయుగం నాటి వాళ్లని చెప్పారు. రష్యాకు చెందిన హెలీనా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. కుర్తాళం పీఠానికి చెందిన మౌనస్వామి కూడా శంభలలో తపస్సు చేశారట. నికోలస్ రోరిట్చ్ అనే పరిశోధకుడు కూడా శంభలపై అధ్యయనం చేశారట. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా శంభల గురించి తెలుసుకుని ఓ బృందాన్ని హిమాలయాల వద్దకు పంపాడట. తర్వాత 1980లో వడ్డిపర్తి పద్మాకర్ అనే ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్లగా భయంకరమైన మంచు తుఫాను చుట్టిముట్టిందని, ఆ సమయంలో ఓ 20 అడుగుల ఎత్తయిన ఓ వ్యక్తి తనను రక్షించి జనాలు తిరుగుతున్న ఓ నగరంలో వదిలినట్లు చెప్పారు.

శంభల నగరంలో ఓ మణి ఉంటుందని, దానికి అర్ధచంద్రాకారంలో ఓ ముఖం ఉండి, పెదవులు తెరిచినట్లుగా ఓ ప్రవేశ మార్గం ఉంటుందని నికోలస్ తన పుస్తకాలలో రాశారు. దానికి సిద్ధపురుషులు మంత్రాలతో అర్చన చేస్తారని.. ఆ మణికి కోరిన వరాలు ఇచ్చే శక్తి ఉందని , దానిని కలియుగాంతంలో కల్కి ధరిస్తాడని చెబుతున్నారు. అలాగే సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు రుషులు రాసిన గ్రంథాలు ఇక్కడ ఉన్నాయట. మరి నిజంగానే శంభల నగరం ఉందా, దానిని చూశామని చెబుతున్న వ్యక్తుల మాటలలో నిజం ఎంత..? అనేది తెలియదు.. అందుకే నేటి వరకు శంభల ఓ మిస్టరీ.


Click it and Unblock the Notifications











