దక్షిణాది చిత్ర పరిశ్రమకు కంగన రనౌత్ విరాళం.. ఎంత ఇచ్చారంటే..
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజు వారీ సినీ కార్మికులను ఆదుకొనేందుకు బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముందుకొచ్చారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ)కి రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా తాను నటిస్తున్న జయలలిత బయోపిక్ తలైవా యూనిట్లో పనిచేసే రోజు వారీ కార్మికులను కూడా ఆదుకొన్నారు.
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సినీపరిశ్రమలోని రోజువారీ వేతన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో కంగన రనౌత్ రూ.5 లక్షలు విరాళంగా అందించారు. అలాగే తలైవి యూనిట్ సభ్యులను కూడా అదుకొన్నారు అని ఫెడరేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

తలైవి మూవీ విషయానికి వస్తే.. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కంగన జయలలితగా నటించారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, జిషు సేన్ గుప్తా, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను జయలలిత జన్మదినం ఫిబ్రవరి 25న రిలీజ్ చేశారు. ఈ చిత్రం తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథా, రచనా సహకారం అందిస్తున్నారు.
ఇప్పటికే దక్షిణాదిలోని ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు కరోనా బాధితుల సహాయనిధులకు వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్నారు. బాలీవుడ్కు చెందిన అమితాబ్తో పలువురు స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











