కన్నప్పను బహిష్కరించండి.. మంచు విష్ణు మూవీపై బ్రహ్మణుల ఆగ్రహం
దాదాపు 13 ఏళ్ల క్రితం మంచు విష్ణు, హన్సిక మోత్వానీ నటించిన దేనికైనా రెడీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమ సామాజిక వర్గాన్ని, తమ మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. విషయం కోర్టు వరకు వెళ్లడంతో చిత్ర యూనిట్పై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ వ్యవహారం శృతిమించి మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే పెద్దల రంగ ప్రవేశంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇన్నేళ్ల తర్వాత మరోసారి అదే మంచు ఫ్యామిలీతో బ్రహ్మణులు మరోసారి యుద్ధానికి దిగారు. ఈ వివరాల్లోకి వెళితే..
కన్నప్ప విడుదలకు అవరోధాలు
అసలు ఏ ముహూర్తంలో మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి శ్రీకారం చుట్టారో కానీ అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. సినిమా సెట్స్ మీదకి వెళ్లిన తర్వాత వదిలిన పోస్టర్లు, టీజర్లపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కన్నప్ప కథను వక్రీకరిస్తున్నారంటూ కొందరు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. నటీనటుల పాత్రలపైనా దుమారం రేగింది. ఇక హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్పైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణులు వివరణ ఇచ్చుకుంటూ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు.

రిలీజ్ డేట్ మార్చిన మంచు విష్ణు
భారీ స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్తో తెరకెక్కిన కన్నప్పను తొలుత ఏప్రిల్ 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కానీ అనూహ్యంగా కన్నప్ప సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. కీలకమైన సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే జూన్ 27న కన్నప్పను విడుదల చేస్తున్నట్లు విష్ణు అనౌన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా రిలీజ్ పోస్టర్ను విడుదల చేశారు.
కన్నప్ప హార్డ్ డిస్క్ చోరీ
సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్న వేళ కన్నప్ప యూనిట్కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోవడం కలకలం రేపింది. తనకే ఎందుకిలా జరుగుతుందంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. హార్డ్ డిస్క్ మాయంపై సోదరుడు మనోజ్పైనా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయగా.. దీనికి మనోజ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. విడుదల తేదీ దగ్గరపడటంతో మోహన్ బాబు, విష్ణులు ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కన్నప్ప చిత్రానికి ఊహించని నిరసన వ్యక్తమైంది.
కన్నప్పపై బ్రాహ్మణుల నిరసన
ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరిలు పిలక, గిలక అనే పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది వీరిద్దరికి సంబంధించిన పోస్టర్లను సైతం విడుదదల చేశారు. అయితే తాజాగా వీర పాత్రలపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణులను తమ సినిమాల్లో కించపరచడం మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిందని వారు మండిపడుతున్నారు. కన్నప్ప సినిమాను బహిష్కరించాలని గుంటూరులో బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నగరవ్యాప్తంగా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి నిరసన తెలిపారు. ఈ చిత్రంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని, కన్నప్పను బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి తాజా వివాదంపై మోహన్బాబు, మంచు విష్ణులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











