తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం: సీనియర్ హీరో సతీమణి కన్నుమూత
ఏడాది కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పోయిన సంవత్సరం పలువురు నటీ నటులు, టెక్నీషియన్లు ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఈ ఏడాది ప్రారంభంలోనూ కొందరు సినీ ప్రముఖులు మరణించారు. ఈ క్రమంలోనే తాజాగా మరో సినీ కుటుంబంలో విషాదం అలముకుంది. కత్తి యుద్దాల స్పెషలిస్టుగా పేరొందిన సీనియర్ హీరో కాంతారావు సతీమణి హైమావతి (87) శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కాంతారావు సతీమణి హైమావతి హైదరాబాద్ శివారు ప్రాంతమైన మల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్లుగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తోన్న ఆమె.. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా ఆమె ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. హైమావతి మరణంపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇదిలా ఉండగా, 1953లో 'ప్రతిజ్ఞ' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు కాంతారావు. సుదీర్ఘమైన కెరీర్లో దాదాపు 100 చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన.. మొత్తంగా ఐదు వందల చిత్రాల్లో కనిపించారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ నటించారు. సినిమా నటుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చక్కగా నడుపుకోలేకపోయారు. అందుకే ఆస్తులన్నీంటినీ కోల్పోయారు. ఈ క్రమంలోనే 2009లో మార్చి 22న కాంతారావు మరణించారు. అప్పటి నుంచి హైమావతి ఒంటరిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











