Kantara: Chapter 1: కాంతారా సెట్లో మిస్టరీ మరణాలు.. రిషభ్ శెట్టికి జస్ట్ మిస్
కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా రేంజ్ను పెంచిన సినిమా కాంతార. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం రూ.14 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతార ఏకంగా రూ.450 కోట్ల వసూళ్లు సాధించింది. హోంబలే ఫిల్మ్స్కు వరుసగా మరో హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 పేరుతో దానిని సెట్స్ పైకి తీసుకెళ్లారు.
అక్టోబర్ 2న కాంతార 2
2023 నవంబర్లో కాంతార ప్రీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదుర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిషభ్ శెట్టి, జయరాంలు కీలకపాత్రలు పోషిస్తుండగా మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కన్నడంతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో కాంతార చాప్టర్ 1ను రిలీజ్ చేయనున్నారు.

రిషభ్ శెట్టికి 100 కోట్ల రెమ్యునరేషన్
ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే కళ్లు చెదిరే బిజినెస్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో కళ్లు చెదిరే ధరకు దక్కించుకుంది. అది ఎన్ని కోట్లకు అనేది మాత్రం తెలియరాలేదు. ఇక కాంతార 2 కోసం రిషభ్ శెట్టి కూడా భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం బట్టి రిషభ్ దాదాపు రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. రూ.50 కోట్లను పారితోషికంగా.. మరో రూ.50 కోట్లు ప్రాఫిట్స్లో షేర్ రూపంలో ఉంటుందని గాసిప్స్ వస్తున్నాయి.
గాలివానకు కొట్టుకుపోయిన సెట్
అయితే కాంతార చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనూహ్య ఘటనలు జరుగుతుండటం ఈ చిత్ర యూనిట్ను కలవరపాటుకు గురిచేస్తోంది. సెట్స్ మీదకు వెళ్లిన కొత్తలోనే ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్సు కర్ణాటకలోని ముడూరులో బోల్తాపడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా ప్రాణాలతో బయటపడినప్పటికీ.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకే గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ కూలిపోయింది.
ముగ్గురు కాంతార నటులు మృతి
ఆ తర్వాత కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి గల్లంతయై శవంగా తేలాడు. అనంతరం కొద్దిరోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడి పెళ్లికి హాజరై మెహిందీ ఫంక్షన్లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తాజాగా మరో నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్ కోసం తీర్ధహళ్లిలో చిత్ర యూనిట్తో కలిసి విజు బస చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆయను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

ప్రమాదం నుంచి బయటపడ్డ రిషభ్ శెట్టి
ఇప్పుడు ఏకంగా కాంతార చాప్టర్ 1 దర్శకుడు, హీరో రిషభ్ శెట్టి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా శనివారం సాయంత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులతో కూడిన 30 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. వీరిలో రిషభ్ శెట్టి కూడా ఉన్నారు. ఈ క్రమంలో పడవ అకస్మాత్తుగా మునిగిపోవడంతో వీరంతా ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే కెమెరాతో పాటు పలు పరికరాలు నీట మునిగాయి. కాంతారా చాప్టర్ 1లో భాగమైన కపిల్, రాకేష్ పూజారి, కళాభవన్ విజుల మరణాలు, సెట్లో వరుస ప్రమాదాలతో యూనిట్ సభ్యులు ఆందోళను గురవుతున్నారు.
పంజుర్లి దేవత శాపం వల్లేనా?
అయితే పంజుర్లి దేవత శాపం వల్లే కాంతారా 2 యూనిట్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయని శాండల్వుడ్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పర్యావరణ నిబంధనలను ధిక్కరించి ఈ సినిమా షూటింగ్ కోసం అడవిలో మంటలు వేయడం, పేలుళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ దెబ్బకు ఏనుగులు బెదిరిపోయి గ్రామాలకు మీదకు వస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడు కాంతార 2 యూనిట్లో వరుస విషాదాలకు ఈ తప్పులే కారణమని వారు చెబుతున్నారు. దీంతో కాంతార చాప్టర్ 1 షూటింగ్ నిర్విఘ్నంగా జరుగుతుందా? మధ్యలోనే ఆపేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











