రజనీ-శివ కాంబో.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ఓపెనింగ్.. హాజరుకాని హీరోయిన్
సూపర్ స్టార్ రజినీకాంత్ వేగం చూస్తుంటే కుర్ర హీరోలకు మతి పోవాల్సిందే. ఒక ప్రాజెక్ట్ అయిన వెంటనే విశ్రాంతి తీసుకునే హీరోలున్న ఈ కాలంలో.. రజనీ వేగం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఓ ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగానే.. మరోటి లైన్లో పెట్టేస్తున్నాడు. రజినీ తాజా చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించేశాడు.
శివ దర్శకత్వంలో మూవీ..
తమిళ నాట అజిత్-శివ కాంబినేషన్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేదాలం, వీరం, విశ్వాసం, వివేగం లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోయిన దర్శకుడు శివ.. ప్రస్తుతం తలైవార్ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్దం చేశాడు. ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించేశారు.
కార్యక్రమంలో సందడి చేసిన మీనా, కుష్బు..
సన్ పిక్చర్స్ కాంబినేషన్లో రజినీ చేస్తోన్న ఈ మూవీలో మీనా, కుష్బు, కమెడీయన్ సూరి, ప్రకాశ్ రాజ్ లాంటి వారు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో మీనా, కుష్బు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

హాజరుకాని హీరోయిన్
ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఎంపికైనట్లు రెండ్రోజుల క్రితమే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకుంది కీర్తి సురేష్. ఆయన్ను చూస్తూ ఉండిపోయే స్టేజ్ నుంచి.. ఆయనతో కలిసి నటించే స్థాయి వరకు రావడంతో ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ పూజా కార్యక్రమాలకు మాత్రం కీర్తి హాజరు కాలేదు. మిగతా ప్రాజెక్ట్లో బిజీగా ఉండటం వల్లే హాజరుకాలేదని తెలుస్తోంది.
నెగెటివ్ రోల్లో మీనా..
ఈ చిత్రంలో రజినీని ఎదిరించే పాత్రలో మీనా నటించబోతోన్నట్లు తెలుస్తోంది. మీనా పెళ్లి తరువాత తన ఆచితూచి ప్రాజెక్ట్లను ఎంచుకుంటూ వస్తోంది. రీసెంట్గా వెబ్ సిరీస్లోకి అడుగుపెట్టేసింది. మరి ఈ చిత్రంలో మీనా ఎలా నటిస్తుందో చూడాలి. రజినీ-ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తోన్న దర్బార్ సంక్రాంతికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











