రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్: డైరెక్టర్తో పాటు వాళ్లందరితో స్పెషల్ మీటింగ్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ఇది షూటింగ్ జరుగుతుండగానే చాలా చిత్రాలను లైన్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఇక, పవర్ స్టార్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పిరియాడిక్ జోనర్తో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీ మొగల్ కాలం నాటి కథతో రూపొందుతోంది. కోహినూర్ డైమండ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత దీనికి చాలా సార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోంది. అంతేకాదు, మెయిన్ సీక్వెన్స్ మొత్తం వాయిదా పడిపోయింది. దీంతో దీనికి సంబంధించి దాదాపు యాభై శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది. మిగిలిన భాగం కోసం కొత్త షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్లోని ప్రముఖ స్టూడియోలో ఎర్రకోట, చార్మినార్ సహా ఎన్నో భారీ సెట్లను చాలా రోజుల క్రితమే నిర్మించి పెట్టారు. అయితే, 'భీమ్లా నాయక్' మూవీ కోసం దీనికి బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్.. మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ను షురూ చేయబోతున్నాడని తెలిసింది. అప్పటి వరకూ డైరెక్టర్ క్రిష్ మిగిలిన పనులపై ఫోకస్ చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచి చేయబోతున్న షూట్కు సంబంధించిన సరైన వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాడు. తాజాగా దీని గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.
'హరిహర వీరమల్లు' కొత్త షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్ను ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం ఇప్పటికే యాక్షన్ కొరియోగ్రాఫ్ శామ్ కౌశల్తో చర్చలు జరిపాడు క్రిష్. ఇక, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్, స్క్రిప్ట్ లెర్నింగ్ సెషన్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కలిశారు. శనివారం రాత్రి దర్శకుడితో పాటు పలువురు యూనిట్ సభ్యులు హీరోతో సంప్రదింపులు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక, ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందని అంటున్నారు.
'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్ను కేటాయించారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











