కుర్చీ తాత ఇకలేడు... మరణానికి కారణం ఏంటంటే?
సోషల్ మీడియా రాకతో పలువురు రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిన సంగతి తెలిసిందే. ప్రజల్లో పేరుతో పాటు డబ్బును సంపాదిస్తున్నారు. అలా ఓ చిన్న డైలాగ్తో ఫేమస్ అయ్యాడు కుర్చీ తాత అలియాస్ మహమ్మద్ పాషా. సోషల్ మీడియాలో కుర్చీతాతగా ఫాలోయింగ్ సంపాదించిన ఆయన ఇకలేరు. బుధవారం రాత్రి కుర్చీతాత కన్నుమూశాడు. దీంతో తాత ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఎవరీ కుర్చీతాత?
హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్, కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెంటూ జీవనం సాగించేవాడు మహమ్మద్ పాషా. ఓ ఇంటర్వ్యూలో కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్తో ఫేమస్ అయ్యాడు. ఈ పదం అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడంతో సంగీత దర్శకుడు థమన్ కంట్లో పడింది. సూపర్స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో వచ్చిన పాట కోసం ఉపయోగించుకున్నాడు థమన్.
దీనికి గాను కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చాడు. అంతేకాదు.. ఈ పాట ప్రోమోలో ఏకంగా మహేశ్ బాబుతో కలిసి డ్యాన్స్ చేసి థియేటర్లో పూనకాలు తెప్పించాడు కుర్చీ తాత. గుంటూరు కారంలో కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్తో వచ్చిన పాటతో మరింత ఫేమస్ అయ్యాడు తాత. వరుసపెట్టి ఇంటర్వ్యూలు, ఫేమ్తో ఈ వయసులోనూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ కావొచ్చని నిరూపించాడు.
ప్రస్తుతం ఈ క్రేజ్ తగ్గిపోవడంతో తిరిగి భిక్షాటన చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు కుర్చీతాత. బుధవారం కృష్ణకాంత్ పార్క్లో నడుస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు గమనించి సీపీఆర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ కారణంగానే కుర్చీతాతకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
పార్క్ సిబ్బంది సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కృష్ణకాంత్ పార్క్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇన్నాళ్లుగా తాత బాగోగులు చూసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వైజాగ్ సత్య.. కుర్చీతాత ఇకలేడని తెలిసి కంటతడి పెడుతున్నాడు. మహేశ్ బాబు అభిమానులు, నెటిజన్లు కుర్చీతాతకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ, సెలబ్రిటీ స్టేటస్ వచ్చినప్పటికీ కుర్చీతాత వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులున్నాయి. వృద్ధాప్యంతో ఎలాంటి పని చేయలేకపోవడంతో పాటు కొన్ని వ్యసనాలకు బానిస అయ్యాడు. విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉండటంతో ఆయన కాలేయం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పలుమార్లు ఆసుపత్రుల్లో చేరాడు. అయితే గతంలోనూ కుర్చీ తాత మరణించినట్లు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టింది. వీటిని యూట్యూబర్ వైజాగ్ సత్య ఖండించారు.


Click it and Unblock the Notifications



