రాజ్తరుణ్ కేసులో ట్విస్ట్.. నోటీసులతో పోలీసులు పెట్టిన డెడ్లైన్ ఏంటంటే?
రాజ్ తరుణ్ - లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. తమ జీవితాల్లోకి హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎంటరయ్యాక రాజ్తో తనకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.
రాజ్ను వదిలేయాలని, లేనిపక్షంలో అంతు చూస్తామని మాల్వీ , ఆమె సోదరుడు తనకు వార్నింగ్ ఇచ్చారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆరోపణలపై క్లారిటీతో పాటు తగిన ఆధారాలు ఇవ్వాలని లావణ్యకు నార్సింగి పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన లావణ్య.. ఈ మేరకు మెడికల్ రిపోర్ట్స్, దాదాపు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసుపై పోలీసుల విచారణ జరుగుతున్న దశలోనే రాజ్ లేకుండా తాను బతకలేనని, అన్నింటికీ మాల్వీయే కారణమంటూ అర్ధరాత్రి పూట తన లాయర్కు సూసైడ్ మెసేజ్ పెట్టి కలకలం సృష్టించింది లావణ్య. పోలీసులు సమయానికి ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫిర్యాదులో ఆరోపించిన అంశాలకు పక్కా ఆధారాలు సమర్పిస్తే రాజ్ తరుణ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నేరం రుజువైన పక్షంలో ఆయనకు కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు.
కెరీర్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు పర్సనల్ లైఫ్లోనూ సమస్యలతో సతమతమవుతున్నాడు. లావణ్య కేసులో అతనికి శిక్షపడితే రాజ్తో సినిమాలు కమిటైన దర్శక, నిర్మాతలుకు ఇబ్బందులు తప్పవు. అటు ఈ యువ హీరో సైతం లావణ్య ఆరోపణలపై లీగల్గానే ఫైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లావణ్యతో రాజీచేసుకునేందుకు రాజ్ తరుణ్ సైతం సిద్ధమయ్యారని.. ఇందుకోసం డబ్బులు ఆఫర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైనా లావణ్య ఓ ప్రెస్మీట్లో క్లారిటీ ఇచ్చారు. రాజ్ తరుణ్ మేనేజర్, ఓ లాయర్ నుంచి తనకు రెండుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని.. కేసు విత్డ్రా చేసుకుని, క్షమాపణలు చెబితే రూ.5 కోట్లు ఇస్తామన్నారని, కానీ ఆ ఆఫర్ తిరస్కరించినట్లు లావణ్య తెలిపారు.
ఈ క్రమంలో రాజ్ తరుణ్ - లావణ్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ నెల 18లోపు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నార్సింగి పోలీసులు రాజ్తరుణ్కు నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్లపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే . కేసు రోజురోజుకు జఠిలంగా మారుతుండటంతో పోలీసులు దూకుడు పెంచారు. దీనిలో భాగంగానే రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఏం జరుగుతుందోనని ఫిలింనగర్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











