దర్శక శిఖరం భారతీరాజా కన్నుమూత.. లెజెండరీ డైరెక్టర్ మరణానికి కారణమేమిటంటే?
Bharathiraja: భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామీణ కథలకు కొత్త రూపాన్ని ఇచ్చిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) ఇక లేరు. ప్రముఖ దర్శకుడు, 'దర్శక శిఖరం'కొంతకాలంగా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన బుధవారం (జూన్ 10వ తేదీ) రోజున చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భారతీ రాజా వయసు 84 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆయనకు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
1941 జూలై 17న తమిళనాడులో జన్మించిన భారతీరాజా, సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1977లో విడుదలైన '16 వయథినిలే' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. గ్రామీణ నేపథ్యంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అనంతరం అదే కథను తెలుగులో 'పదహారేళ్ల వయసు'గా తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.

తెలుగు చిత్రసీమలో భారతీరాజా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 'కొత్త జీవితాలు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన, తర్వాత 'సీతాకోకచిలుక', 'ఆరాధన', 'జమదగ్ని' వంటి క్లాసిక్ సినిమాలను అందించారు. ముఖ్యంగా 'సీతాకోకచిలుక' చిత్రం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రేమ, భావోద్వేగాలు, గ్రామీణ జీవనశైలిని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.
దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా ఆయన ప్రతిభ చాటుకున్నారు. 'మంగమ్మగారి మనవడు' సినిమాకు కథను అందించగా, 'పల్నాటి పౌరుషం' సినిమాకు స్క్రీన్ప్లే అందించారు. ఆయన సృజనాత్మకత, కథ చెప్పే తీరు దక్షిణాది సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన ఆరు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే 'సీతాకోకచిలుక' చిత్రానికి జాతీయ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు.
సినిమాల్లో కొత్త తరానికి మార్గదర్శకుడిగా నిలిచిన భారతీరాజాను భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఇటీవల మోహన్లాల్ నటించిన 'తుడురమ్' చిత్రంలో ఆయన చివరిసారిగా వెండితెరపై కనిపించారు.
అయితే వ్యక్తిగత జీవితంలో గత ఏడాది ఆయనను తీవ్రంగా కలిచివేసిన సంఘటన చోటుచేసుకుంది. ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఈ విషాదాన్ని భారతీరాజా జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కుమారుడి మరణం తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు వెల్లడించారు.
ఇటీవల కూడా పలువురు సినీ ప్రముఖులు భారతీరాజాను కలిసి పరామర్శించారు. ప్రముఖ నటి రాధిక ఆయనను కలిసిన సందర్భంగా జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాధిక నటించిన 'తాయ్కిళవి' చిత్రానికి జాతీయ అవార్డు వచ్చే అవకాశముందని భారతీరాజా ఆశాభావం వ్యక్తం చేయగా, "అవార్డు వస్తే మీ పాదాల వద్ద ఉంచుతాను" అంటూ రాధిక భావోద్వేగంగా స్పందించారు. భారతీరాజా మరణంతో భారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది.


Click it and Unblock the Notifications




