Rave Party: బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లిన టాలీవుడ్ సెలబ్రెటీల లిస్ట్ ఇదే.. ఎఫ్ఐఆర్లో పేర్లు
దేశ ఐటీ రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాంహౌస్ జరిగిన రేవ్ పార్టీ తెలుగు, కన్నడ సినీ-టీవీ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పార్టీకి రెండు పరిశ్రమలకు చెందిన నటీనటులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు.
అయితే టాలీవుడ్కు చెందిన హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, కొరియోగ్రాఫ్ జానీ మాస్టర్ పేర్లు ఈ కేసులో వినిపించడంతో కలకలం రేపింది. ఆ వెంటనే వీరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాము ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని , మేం అలాంటి వాళ్లం కాదని వీడియో బైట్లు వదిలారు. మరి ఎవ్వరూ వెళ్లకపోతే.. ఇంతకీ దొరికినవారెవ్వరు అనే సందేహాలు కలుగుతున్నాయి.

రేవ్ పార్టీ జరిగిన జీఆర్ ఫాంహౌస్ హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డిదిగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దాడిలో ఇంకా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు లభ్యమవ్వగా.. పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా హాజరైనట్లుగా తేల్చారు. అది కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారే వీరిలో అత్యధికంగా ఉన్నారట.
అలాగే వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట ఇష్యూ అయిన పాస్ అతికించిన కారు లభ్యమయ్యాయి. బెంగళూరు పోలీసులు, నార్కోటిక్స్ విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. అయితే పట్టుబడిన ఆ సినీ ప్రముఖులు ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. సినీనటి హేమ తాను పార్టీకి వెళ్లలేదన్న వార్తలను బెంగళూరు పోలీసులు ఖండించారు. ఆమె పోలీసుల అదుపులోనే వుందని.. అందరినీ తప్పుదోవ పట్టించడానికే హేమ ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు.

ఆమె సంగతి పక్కనబెడితే మిగిలిన వారి సంగతేంటనేది ఇప్పుడు తేలాల్సి వుంది. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లు వీరేనంటు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఒకటి ఈ మేరకు ఓ జాబితాను విడుదల చేసింది. క్రికెట్ బుక్కీగా వ్యవహరిస్తున్న వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు వీరంతా హాజరైనట్లుగా సదరు ఛానెల్ పేర్కొంది. హైదరాబాద్లోని ఫాంహౌస్లపై పోలీసుల నిఘా ఉండటంతో వీరు బెంగళూరులో పార్టీ చేసుకోవాలని నిర్ణయించారు. తొలిరోజు 140 మంది, రెండో రోజు 105 మంది ఈ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు.
నటి హేమకు క్లోజ్ ఫ్రెండ్ అయిన చిరంజీవి , అరుణ్, శివానీ జైస్వాల్, సందీప్ కొర్రపాటి, రిషి చౌదరి, డింపుల్ చౌదరి, వెంకట్ చౌదరి (గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరికి అత్యంత సన్నిహితుడు), బుల్లితెర నటి అషీరాయ్ ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు. అయితే కుటుంబానికి విషయం చెబుతానని చెప్పి హేమ ఫోన్ తీసుకున్నారని.. తర్వాత వీడియో తీసి తాను ఇక్కడ లేనని మీడియాకు ఇచ్చారని చెప్పారు.
బెంగళూరులో జరిగిన పార్టీలో 30 మంది యువతులు, 70 మంది యువకులు తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీ కోసం నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.40 లక్షలు చెల్లించినట్లుగా సమాచారం. అయితే రేవ్ పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేది తెలుసుకోవడానికి పోలీసులు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











