ఆ వివాదంపై లోకేశ్ కనగరాజ్ ఓపెన్... అల్లు అర్జున్ మూవీపై క్లారిటీ!
కోలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన 'ఖైదీ 2' వివాదంపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఎట్టకేలకు స్పందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత, 'ఖైదీ 2' పూర్తిగా రద్దయిందన్న ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు, భారీ రెమ్యునరేషన్ కారణంగానే లోకేశ్ ఈ సీక్వెల్ను పక్కన పెట్టారని కూడా పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ రూమర్లన్నింటికీ లోకేశ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
డైరెక్టర్ లోకేశ్ మాట్లాడుతూ.. 'అల్లు అర్జున్తో సినిమా పూర్తయిన వెంటనే నేను చేయబోయేది 'ఖైదీ 2'నే. దీనిపై ఎలాంటి సందేహం అవసరం లేదు. నేను అనుకున్న మూడు సినిమాలు 'ఖైదీ 2', 'విక్రమ్ 2', 'రోలెక్స్'లను కచ్చితంగా పూర్తి చేస్తాను' అని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో 'ఖైదీ 2' ఆగిపోయిందన్న ప్రచారానికి పూర్తిస్థాయి ఫుల్స్టాప్ పడినట్లయింది. ఇక ఖైదీ కార్తీ-లోకేశ్ కాంబినేషన్లో తెరకెక్కి బ్లాక్బస్టర్గా నిలిచిన సినిమా. ఈ సినిమాకి సీక్వెల్గా 'ఖైదీ 2'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఇటీవల లోకేశ్ బన్నీతో సినిమా ప్రకటించడంతో, 'ఖైదీ 2'ను పక్కన పెట్టేశారన్న వార్తలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన లోకేశ్, 'రెమ్యునరేషన్ కారణంగా 'ఖైదీ 2'ను ఆపేశానన్న మాటల్లో ఏమాత్రం నిజం లేదు. డబ్బుల వల్ల నేను ఎప్పుడూ ఒక సినిమా వదిలిపెట్టలేదు' అని ఖండించారు. అల్లు అర్జున్ మూవీ తర్వాతే 'ఖైదీ 2' పనులు మొదలవుతాయని, ఈ ఆలస్యం పూర్తిగా డేట్స్ కారణంగానే వచ్చిందని ఆయన వివరించారు. హీరో కార్తీ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతోనే సీక్వెల్ ఆలస్యమైందని చెప్పారు.
మైత్రీ కమిట్మెంట్ కారణంగానే బన్నీ మూవీ
అల్లు అర్జున్తో సినిమా ఎందుకు ముందుగా చేస్తున్నారన్న ప్రశ్నకు లోకేశ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ తో నేను కమిట్ అయ్యాను. ఆ మాట ప్రకారమే ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నాను. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు' అని స్పష్టం చేశారు. ఖైదీ 2 కోసం కార్తీ ఇచ్చిన డేట్స్ను మరో దర్శకుడు వినియోగించుకోవడంతో, ఈ గ్యాప్లో బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని వివరించారు.
ఎల్సీయూ కొనసాగుతుంది!
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కి బ్రేక్ పడిందన్న ప్రచారంపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. 'ఎల్సీయూ పూర్తిగా కొనసాగుతుంది. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ తప్పకుండా వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాను' అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తాను కథ అందించిన 'బెంజ్' సినిమా కూడా ఎల్సీయూ లో భాగమేనని తెలిపారు. రాఘవ లారెన్స్ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
రజనీ-కమల్ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు?
ఈ సందర్భంగా రజనీకాంత్, కమల్ హాసన్ తో అనుకున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి కూడా లోకేశ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'కూలీ' సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని కోరారని, అందుకోసం తాను నెలన్నర పాటు కష్టపడి ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ రాశానని చెప్పారు. 'ఆ కథ వారికి నచ్చింది. కానీ వారు ఈసారి సింపుల్, లైట్ ఎంటర్టైనర్ కోరుకున్నారు. అలాంటి సినిమా తీయడం నాకు రాదు. ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి గౌరవంగా తప్పుకున్నాను' అని తెలిపారు.
విజయ్ సినిమాలో అతిథి పాత్ర
ఇక విజయ్ హీరోగా హెచ్.వినోద్ తెరకెక్కించిన 'జన నాయగన్' సినిమాలో తాను అతిథి పాత్రలో కనిపించబోతున్నానని లోకేశ్ వెల్లడించారు. ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక, అల్లు అర్జున్ సినిమా కారణంగా 'ఖైదీ 2' రద్దయిందన్న రూమర్లను లోకేశ్ కనగరాజ్ పూర్తిగా ఖండించడంతో కార్తీ, ఎల్సీయూ అభిమానుల్లో ఊరట కలిగింది. బన్నీ మూవీ తర్వాత ఖైదీ 2పై పూర్తి ఫోకస్ పెడతానన్న లోకేశ్ హామీతో, ఈ సీక్వెల్పై మళ్లీ భారీ హైప్ ఏర్పడడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











