మంచు విష్ణు సంచలన నిర్ణయం.. వారిపై మా సీరియస్ యాక్షన్
కాలక్షేపం కోసం, స్నేహితులతో టచ్లో ఉండేందుకు అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు బలమైన శక్తిగా మారింది. ఎన్నో ప్రజా పోరాటాలు, ఉద్యమాలకు వేదికగా నిలిచి.. ప్రభుత్వాలనే గడగడలాడిస్తోంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు.. సాంకేతికతను మంచికి ఉపయోగిస్తే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా బాగుంటాయి. అలా కాకుండా చెడుకు వాడితే పర్యవసానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే ఈ విషయం ఎందరికో అర్ధమైంది.
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడే సైబర్ క్రైమ్ కేటుగాళ్లు విపరీతంగా పుట్టుకొచ్చారు. ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి అందినకాడికి దోచుకోవడమే వీరిపని. ఇంకొందరు ఆ ఖాతాలను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వ్యక్తుల పర్సనల్ లైఫ్లోకి కూడా సోషల్ మీడియా తొంగిచూస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో ఏది అసలో, ఏది నకిలీయో తెలియడం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల ప్రముఖుల పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతున్నాయి. వారు బాధపడుతుంటే కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వీరి ఆగడాలు ఆగటం లేదు. ఎక్కువగా సినీ పరిశ్రమకు చెందిన వారు సోషల్ మీడియా బాధితులుగా మారిపోతున్నారు.
వ్యూస్, డబ్బుల కోసం ఫలానా హీరో, ఫలానా హీరోయిన్తో తిరుగుతున్నాడంటూ లేనిపోని సంబంధాలు అంటగట్టేస్తూ దిగజారిపోతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలలో పెట్టే థంబ్నైల్స్ చూస్తే లోపల మేటర్ లేకున్నా.. ఏదో ఉంది అనిపించేలా హెడ్డింగ్స్ పెట్టి జనాలను ఆకర్షిస్తుంటారు. నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోయి .. వారి ఇంట్లోని కుటుంబ సభ్యులను.. చివరికి మహిళలను, చిన్నారులను సైతం బజారుకీడుస్తున్నారు .

ఎదుటి వ్యక్తి బాధపడనంత వరకు మీమ్స్, ట్రోలింగ్లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ అసభ్యంగా దూషించడానికి, పరువు ప్రతిష్టలపై దెబ్బ కొట్టడానికి వీటిని వినియోగించడం ఈ మధ్య ఎక్కువైంది. వందల్లో ఉండే ఈ యూట్యూబ్ ఛానెళ్లు , సోషల్ మీడియా ఖాతాలు ఎక్కడ నుంచి నడుస్తున్నాయో, ఎవరు నడుపుతున్నారో తెలియదు. ఈ మధ్య వీరి ఆగడాలు శృతి మించుతుండటంతో మా అధ్యక్షుడు మంచు విష్ణు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని ఛానెళ్లను టెర్మినెట్ చేయించారు కూడా. కొద్దిరోజుల క్రితం నటులు రాజీవ్ కనకాల, శివబాలాజీ, శివకృష్ణలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
తాజాగా నటీనటులపై అభ్యంతరకరమైన కంటెంట్ను పోస్ట్ చేసిన 18 యూట్యూబ్ ఛానెల్స్ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యాన్ చేయించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మా అసోసియేషన్ వెల్లడించింది. ఇంకా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ట్రోలర్స్ను గమనించామని.. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. ఇలాంటి వ్యక్తులు మీ ఛానెల్స్, ప్రొఫైల్స్ నుంచి అలాంటి కంటెంట్ను తీసివేయాలని మా హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఛానెల్స్పై చర్యలు తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











