'ఎవరు'పై మహేష్ బాబు కామెంట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన అడవి శేష్
అడవి శేష్ హీరోగా కొత్త దర్శకుడు రాంజీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఎవరు'. పీవీపీ సినిమాస్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీతో రూపొందిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచే మంచి స్పందనను రాబట్టుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎవరు సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాపై, అడవిశేష్ నటనపై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ చేశాడు. ''ఎవరు సినిమా చూసి థ్రిల్ అయ్యాను. గొప్ప స్క్రీన్ప్లేతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇది. అద్భుతంగా తీశారు. సినిమా విజయంలో భాగమైన అడివిశేష్ సహా ఎంటైర్ యూనిట్కి అభినందనలు'' అని ట్వీట్లో పేర్కొన్నారు.

మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ పై వెంటనే రిప్లై ఇచ్చిన అడివిశేష్ ''ఆన్ స్క్రీన్లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్లోనూ సినిమాను ప్రోత్సహిస్తున్న సూపర్స్టార్ మహేశ్కి థ్యాంక్స్. 'మేజర్' చిత్రంతో మీమ్మల్ని గర్వపడేలా చేస్తానని భావిస్తున్నాను'' అని తెలిపాడు.
అడివి శేష్ హీరోగా 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాత కావడం విశేషం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ ప్రొడక్షన్తో కలిసి జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కించనున్నారు.


Click it and Unblock the Notifications











