27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్తో జయకృష్ణ
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా 'శ్రీనివాస మంగాపురం' అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాకు తెరకెక్కించారు. ఈ సినిమాను జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. దానికి కారణం.. ఇదే తేదీన 27 ఏళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా పరిచయమైన 'రాజకుమారుడు' సినిమా విడుదలైంది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే తేదీన మహేష్ అన్న కొడుకు జయకృష్ణ కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే.. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక ఘట్టమనేని కుటుంబానికి మరో సెంటిమెంటా? అనే చర్చనీయమైంది.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజకుమారుడు' సినిమాతో 1999 జూలై 30న విడుదలైంది. ఈ సినిమాతో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా కమర్షియల్గా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మహేష్ ను స్టార్ హీరోగా ఎదిగేలా చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో వారణాసి సినిమాతో పాన్ వర్డల్ స్టార్ గా పరిచయం కాబోతున్నారు. ఇప్పుడు అదే జూలై 30 తేదీన జయకృష్ణ తన డెబ్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.
ఈ రెండు సినిమాల మధ్య కేవలం విడుదల తేదీ మాత్రమే కాదు, మరికొన్ని ఆసక్తికరమైన పోలికలు కూడా కనిపిస్తున్నాయి. మహేష్ బాబు తొలి చిత్రం 'రాజకుమారుడు'ను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. ఇప్పుడు 'శ్రీనివాస మంగాపురం సినిమాకి కూడా అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే మహేష్ సరసన అప్పట్లో బాలీవుడ్ నటి ప్రీతి జింటా హీరోయిన్గా పరిచయం కాగా, ఇప్పుడు జయకృష్ణ సరసన బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఈ అంశాలు కూడా అభిమానుల్లో సెంటిమెంట్గా మారాయి.
'శ్రీనివాస మంగాపురం' సినిమాను తిరుపతి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. వాసుబాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారిన తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలే సినిమాగా తెరకెక్కించనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు 'వెంకటప్పయ్య నాయుడు' అనే పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. జయకృష్ణ వంటి కొత్త హీరోతో పాటు మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడు ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
టాలీవుడ్ లో రిలీజ్ డేట్లు, కాంబినేషన్లు, బ్యానర్లు, పండుగలు వంటి అంశాలను చాలామంది సెంటిమెంట్లుగా భావిస్తుంటారు. మహేష్ బాబు కెరీర్కు మలుపు తిప్పిన జూలై 30నే జయకృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



