ఉపాసనపై నమ్రతా శిరోద్కర్ ఫీడ్ బ్యాక్ .. చిరు, చరణ్ల చేతికి రిపోర్ట్
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనా కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అపోలో గ్రూప్ అధినేత ప్రతాప్ సీ రెడ్డి మనవరాలిగా, మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలిగా పుట్టినింటికి , మెట్టినింటికి పేరు తీసుకొస్తున్నారు. వేల కోట్లకు వారసురాలు అయినప్పటికీ ఉపాసన నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడతారు. ఉన్నతమై వ్యక్తిత్వం, మానవత్వం ఆమెను మరో మెట్టుపైకెక్కించింది.
వివాహమైన నాటి నుంచి భర్తకు తలలో నాలుకలా మారారు ఉపాసన. రామ్ చరణ్ సినిమాలు, షూటింగ్స్, వ్యాపారాలలో బిజీగా ఉండటంతో కుటుంబ బాధ్యతలు ఆమె స్వీకరించారు. స్వతహాగా బిజినెస్ ఉమెన్ కావడంతో వ్యాపారాలు చూసుకుంటూనే కుటుంబాన్ని చక్కదిద్దుతున్నారు ఉపాసన. వ్యాపారాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉపాసన ముందుంటున్నారు.

అపోలో ఫౌండేషన్ సీఎస్ఆర్ వైస్ ప్రెసిడెంట్గా హాస్పిటల్ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి వైద్య సహాయం అందిస్తున్నారు. బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 150కి పైగా వృద్ధాశ్రమాలలో వృద్ధులకు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉపాసన సేవా కార్యక్రమాలపై పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆమెను వరించాయి. పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత గతేడాది చరణ్ - ఉపాసన తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పండంటి ఆడపిల్లకు ఉపాసన జన్మనిచ్చారు. ఆమెకు అమ్మవారి సహస్ర నామాల్లో ఒకటైన క్లీంకారా అని పేరు పెట్టుకున్నారు.
ఇక తన అత్తగారు సురేఖతో ఎంతో ఆత్మీయంగా మెలుగుతారు ఉపాసన. అత్తగారితో గడిపిన క్షణాలను ఆమె ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా అత్తమ్మ సురేఖ వంటకాలు అందరికీ తెలిసేలా చేస్తున్నారు ఉపాసన. సురేఖ గారి వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ను ఇటీవలే ప్రారంభించారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో ఇంటికి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతూ బాధపడుతుంటారు. ఇలాంటి వారి కోసం అత్తమ్మాస్ కిచెన్ ప్రొడెక్ట్స్ అద్భుతమైన రుచిని , ఇంటి వంటకాలను అందిస్తాయని ఉపాసన గతంలో తెలిపారు.

తాజాగా అత్తమ్మాస్ కిచెన్ రుచులను సూపర్స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ రుచి చూశారు. ఈ సందర్భంగా టేస్ట్లు అదిరిపోయాయని సింప్లి ద బెస్ట్ అంటూ నమ్రత కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన ఆమె ఉపాసన, చిరంజీవి, రామ్ చరణ్లకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల మాల్దీవ్స్లో జరిగిన ఓ బర్త్ డే వేడుక సందర్భంగా మెగా, ఘట్టమనేని, అక్కినేని ఫ్యామిలీలు కలుసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











