ఫేమస్ థియేటర్లో భారీ అగ్నిప్రమాదం: కాలి బూడిదైన సినిమా హాల్.. ఆ మూవీ ప్రదర్శన తర్వాత ఘటన!
కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ చాలా రోజుల పాటు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయా సినిమా హాళ్ల యాజమాన్యాలు ఎన్నో కష్టనష్టాలను అనుభవించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా భారీ సినిమాలు వస్తుండడంతో ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే థియేటర్లు అన్నీ కోలుకుంటోన్నాయి. ఇప్పుడిప్పుడే అంతా సాఫీగా సాగిపోతోన్న తరుణంలో హైదరాబాద్లోని ఓ ఫేమస్ థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సినిమా హాల్ మొత్తం కాలి బూడిద అయిపోయింది. దీంతో భారీగానే నష్టం జరిగినట్లు కూడా తెలుస్తోంది. అసలేం జరిగింది? ఈ ప్రమాదం వెనుక కారణాలు ఏంటి? ఈ ఘటనలో ఎంత ఆస్తి నష్టం సంభవించింది అనే వివరాలు మీకోసం!

ఫేమస్ థియేటర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న శివ పార్వతి థియేటర్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ వెంటనే వాళ్లంతా పోలీసులతో పాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో కొన్ని ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి.

ప్రమాదానికి కారణం షాక్ షర్క్యూటే
హైదరాబాద్ నగరంలో ఎంతో ఫేమస్ అయిన శివ పార్వతి థియేటర్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షాక్ షర్క్యూట్ అవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో థియేటర్ మొత్తం కాలి బూడిద అయిపోయింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఏకంగా సినిమా హాల్ పైకప్పు కూడా కూలిపోయినట్లు తెలుస్తోంది.

ఎన్ని కోట్ల ఆస్తినష్టం జరిగిందంటే!
కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఈ ప్రమాదంలో థియేటర్ మొత్తం కాలిపోవడంతో పాటు పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అలాగే అందులో ఉన్న సామాగ్రి మొత్తం దగ్ధమైంది. దీంతో యాజమాన్యానికి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఆ మూవీ ప్రదర్శన తర్వాత ఘటన
కేపీహెచ్బీ కాలనీలోని శివ పార్వతి థియేటర్లో నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ ప్రదర్శితం అవుతోంది. ఆదివారం రాత్రి సెకెండ్ షోను కూడా అందులో ప్రదర్శించారు. అది పూర్తైన చాలా సేపటి తర్వాతనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిసింది.

ప్రాణనష్టం లేకపోవడంతో సంతోషం
ఇక, శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతేకాదు, ఆ సమయంలో థియేటర్ సిబ్బంది కూడా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ భారీ అగ్నిప్రమాద సంఘటనలో ప్రాణనష్టం జరగలేదని ప్రాథమికంగా తెలిసింది. దీనిపై అంతా సంతోషంగా ఉన్నారు.

బాలయ్య సినిమాకు కూడా ప్రమాదం
ఇటీవలే నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రదర్శితం అవుతోన్న సమయంలో వరంగల్, శ్రీకాకుళం జిల్లాల్లోని థియేటర్లల్లో మంటలు చెలరేగాయి. అప్పుడు కూడా ఆయా థియేటర్లలో ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఇలా వరుసగా జరుగుతోన్న సంఘటనలతో ప్రేక్షకులు భయాందోళనలకు గురి అవుతున్నారు.


Click it and Unblock the Notifications











