అవమానాలతో మొదలై పద్మశ్రీ వరకు.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘మల్లేశం’ ట్రైలర్
'పెళ్లి చూపులు' మూవీ తర్వాత పలు చిత్రాల్లో కామెడీ పాత్రల్లో షైన్ అవుతున్న ప్రియదర్శి... త్వరలో ఇప్పటి వరకు అతడు చేసిన సినిమాలకు భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'మల్లేశం' జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రాజ్. ఆర్ దర్శకత్వంలో శ్రీఅధికారి, రాజ్ ఆర్ నిర్మించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
చేనేత కళాకారుడైన మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? 6వ తరగతి డ్రాప్ ఔట్ అయిన ఆయన ఇంజనీర్ ఎలా అయ్యాడు? చేనేత రంగంలో అతడు సాధించిన ఘనత ఏమిటి? అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను నేచి ప్రపంచాన్ని ఎలా అబ్బుర పరిచాడు? అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనే విషయాలు ఫోకస్ చేస్తూ ఈ మూవీ సాగుతుంది.
మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించగా ఆయన భార్య పాత్రను అనన్య పోషించింది. ఝాన్సీ, చక్రపాణి కీలకపాత్రల్లో నటించారు. తెలంగాణ ప్రాంతంలోని సిరిసిల్ల ఏరియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ప్రియదర్శి సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

ఈ చిత్రానికి బాబు శాడిలాస్య సినిమాటోగ్రఫీ అందించగా, లక్ష్మణ్ ఆలే ప్రొడక్షన్ డిజైనర్గా పని చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సౌండ్ డిజైనర్ నితిన్ లుకోస్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేశారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిచగా, పెద్దింటి అశోక్ కుమార్ మాటలు అందించారు. ప్రముఖ రచయిత గోరేటి వెంకన్న, చంద్రబోస్ పాటలు రాయడంతో మరో హైలెట్.


Click it and Unblock the Notifications











