విష్ణు మంచుపై దొంగతనం కేసు.. ఇంటి ముందు మనోజ్ ధర్నా.. మోహన్ బాబు ఫ్యామిలీలో మరో వివాదం
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గత కొద్ది నెలలుగా ఆయన కుమారులు విష్ణు, మనోజ్ మంచు మధ్య గొడవలు జరుగుతుండటం తెలిసిందే. విష్ణు, మనోజ్, మోహన్ బాబు ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకోవడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కిన విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యవహారం కొద్ది రోజులుగా సద్దుమణిగిందనే ఫీలింగ్ కలిగింది. కానీ ఒక్కసారిగా మళ్లీ వారి మధ్య కలహాలు బజారున పడ్డాయి. తాజా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న వివాదానికి కొనసాగింపుగా మనోజ్ మరోసారి విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తన ఇంటిలో పార్క్ చేసి ఉన్న వాహనాన్ని విష్ణు దొంగిలించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. తన నివాసం గోడ దూకి అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించారు. నా విల్లాలోకి ప్రవేశించి ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోదాలు జరుపగా చివరకు ఆ వాహనం విష్ణు కార్యాలయం వద్ద కనిపించింది.

అయితే తన కారు చోరీ వ్యవహారంలో పోలీసులు స్పందించకపోవడంతో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు మనోజ్ వెళ్లి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తాను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన నివాసం ప్రధాన గేట్ వద్ద మనోజ్ బైఠాయించారు. దాంతో మరోసారి ఈ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది.
అయితే మనోజ్ తన ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తుండటంపై మోహన్ బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సుమారుగా 100 మంది పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నారు. మనోజ్ ధర్నా నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తన కూతురు పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడానికి తన ఫ్యామిలీతో కలిసి జైపూరుకు వెళ్లాం. ఆ సమయంలో మా విల్లాలో ఎవరు లేరని తెలుసుకొన్న కొందర తన ఇంటి వద్ద ఉన్న తన కారును దొంగిలించారు. ఇంటి తాళాలు పగలకొట్టి అక్రమంగా లోనికి ప్రవేశించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై తాను తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. ఆయన స్పందించలేదు మనోజ్ అన్నారు.


Click it and Unblock the Notifications











