Manchu Family: బాలయ్యతో మోహన్ బాబు, విష్ణు.. కాసేపటికే పవన్ తో మనోజ్ భేటీ.. ఆసక్తి రేపుతున్న భేటీలు!
టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చిచ్చు రేపగా ఇప్పుడిప్పుడే పరిస్థితులకు సర్దుబాటు అవుతున్నాయి. ఈ క్రమంలో మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాల కృష్ణతో భేటీ కాగా ఈ భేటీ జరిగిన కొద్ది సేపటికి మంచు మనోజ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్నికల హడావుడి
మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తారా స్థాయికి చేరాయి. ఏకంగా రెండు బృందాలుగా విడిపోయి నటీనటులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు గుప్పించుకున్న పరిస్థితి కనిపించింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడగా మంచు విష్ణు మెజారిటీ సాధించి గెలుపొందారు. ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి దాదాపు 11 మంది గెలుపొందగా వారందరూ కూడా మంచు విష్ణు చేసే పనులకు తాము అడ్డం కాకూడదనే ఉద్దేశంతో తప్పుకుంటామని ప్రకటించారు.

వాళ్లతో కలిసి పని చేస్తా
అయితే మంచు విష్ణు మాత్రం ఇది సరైన పద్ధతి కాదని వాళ్ళతో కలిసి పని చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో తనకు ముందు మద్దతు ప్రకటించిన బాలకృష్ణతో ఈరోజు మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి భేటీ అయ్యారు. భేటీ అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ తాను నందమూరి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ఓడిపోవాలని మంగళగిరి వెళ్లి ప్రచారం చేశాను కానీ అవి మనసులో పెట్టుకోకుండా బాలకృష్ణ నా కొడుక్కి ఓటు వేయడమే మద్దతు పలికారని నిజంగా సంస్కారం అంటే అదే అని చెప్పుకొచ్చారు

అందరినీ కలుస్తానని
ఆ తర్వాత మంచు విష్ణు కూడా మీడియాతో మాట్లాడుతూ తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలవడానికి కారణమైన పెద్దలందరికీ కలుస్తున్నాం అని ఇప్పటికే బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని కలిశానని మెగాస్టార్ చిరంజీవి వంటి వారిని కూడా కలుస్తాను అని చెప్పుకొచ్చారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొన్ని ఘాటు విమర్శలు చేయగా దానికి ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేదని విష్ణు పేర్కొన్నారు.

మంచు విష్ణు vs మెగా ఫ్యామిలీ
ఒకరకంగా ఈ కామెంట్స్ తో మంచు విష్ణు vs మెగా ఫ్యామిలీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో తాను వెనక్కి తగ్గనని సారీ కూడా చెప్పనని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. తర్వాత నాగబాబు, ప్రకాష్ రాజు రాజీనామాల ప్రకటనతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. అయితే ఇవేవీ పట్టనట్టుగా మంచు మనోజ్ వెళ్లి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది..
Recommended Video
పవన్ తో భేటీ
'భీమ్లా నాయక్' సెట్స్ లో ఉన్న పవన్ కల్యాణ్ తో మంచు మనోజ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ అంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, మనోజ్ పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని అంటున్నారు. వీరిద్దరూ సుమారు గంటకు పైగా పలు విషయాలపై చర్చించుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు తాజా సినిమాల ప్రస్తావన వచ్చిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











