చిరంజీవి కోసం 81 సార్లు రక్తదానం చేసిన యాక్టర్.. రియల్ హీరో అంటూ..
మెగాస్టార్ చిరంజీవి స్వచ్చంద సేవలో భాగమవుతూ సేవలందిస్తున్న సంస్థల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి రక్తబంధాన్ని ఏర్పరుచుకొంటున్నారు మెగా ఫ్యాన్స్. ప్రతీ రోజు ఎంతో మంది హైదరాబాద్లోని జూబ్లీహిల్ల్స్లో ఉన్న సంస్థ కార్యాలయానికి వచ్చి స్వచ్చందంగా రక్తదానం చేస్తుంటారు. అభిమానులే కాకుండా, సామాన్య ప్రజలతో పాటు హీరోలు, దర్శకులు, ఇతర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమవుతారు. ఇలా క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారిలో నటుడు మహర్షి రాఘవ గారు ఒకరు.
తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు వచ్చి మహర్షి రాఘవ రక్తదానం చేశారు. ఈ సంస్థలో రక్తదానం చేయడం ఆయనకు ఇది 81వ సారి. ఎన్నో ఏళ్లుగా ప్రతీ మూడు నెలలకు ఓసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ వస్తున్నారు. తాజాగా సోమవారం కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనను రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి, చిరంజీవి అభిమాన సంఘాల నేత స్వామి నాయుడు మాట్లాడుతూ.. నటుడు మహర్షి రాఘవను ప్రశంసలతో ముంచెత్తారు. ఎంతో ఉదాత్తమైన కార్యక్రమానికి చేయూతనిస్తున్న ఆయన అభినందనీయులు అని అన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అని స్వామినాయుడు సూచించారు.
ప్రతీ నిత్యం పదుల సంఖ్యలో రక్తదానం చేస్తూ ఫ్యాన్స్ అభిమానాన్ని చాటుకొంటారు. త్వరలో చిరంజీవి బర్త్ డే సందర్భంగా భారీగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











