మెగా ఫ్యామిలీలో ముదిరిన విభేదాలు.. అల్లు అర్జున్, స్నేహారెడ్డిని అన్ఫాలో చేసిన సాయి ధరమ్ తేజ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మెగా ఫ్యామిలీలోని ఇద్దరు వ్యక్తులు వార్తల్లోని వ్యక్తులయ్యారు. వారిలో ఒకరు పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాగా మరొకరు ఐకాన్స్టార్ అల్లు అర్జున్. పార్టీ పెట్టిన పదేళ్ల నిరీక్షణ తర్వాత తాను ఎమ్మెల్యే కావడంతో పాటు తను నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించి , ఏపీలో కూటమికి ఘన విజయం సాధించి పెట్టడంతో పాటు కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఆయన సాధించిన విజయంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు పొంగిపోతున్నారు. ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ పవన్ మేనియా ఏమాత్రం తగ్గలేదంటే ఆయన ఎంతటి ప్రభావం చూపారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక అల్లు అర్జున్ తీరు ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైంది. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండటం లేదని.. దీనికి బన్నీ వైఖరే కారణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా 'చెప్పను బ్రదర్ ' ఇష్యూ నుంచి కుటుంబంలో చీలిక వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్లో చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత రెండు కుటుంబాలు శుభకార్యాల్లో కలిసినా మునుపటిలా బాండింగ్ ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి వేళ ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా పంపింది.

ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఇది తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ బద్ధ వ్యతిరేకి వైఎస్ జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ మెగా, జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు.
అయితే ఫలితాల రోజున అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓటమి పాలయ్యారు. ఈ రిజల్ట్తో అభిమానులు మరోసారి బన్నీని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో ఆన్ ఫాలో చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు శిరీష్ని మాత్రమే సాయి ఫాలో అవుతున్నారు.
అయితే అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ వైఖరి ఏంటనే దానిపై నాగబాబు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలో "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దీనిని బట్టి బన్నీని తాము ఎలా ట్రీట్ చేస్తామో ఆయన చెప్పేశారని సోషల్ మీడియాలో చర్చ నడిచింది.

పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు. వారిలో అల్లు కుటుంబ సభ్యులు కనిపించలేదు. కనీసం పవన్కు ఆల్ ది బెస్ట్ చెబుతూ బన్నీ చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.


Click it and Unblock the Notifications











