మాకు ఏ బెనిఫిట్లు వద్దు .. రేవంత్ సర్కార్పై అల్లు అరవింద్ కామెంట్స్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై కోలుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేయడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం తన సినిమాపై ఫోకస్ పెట్టాడు బన్నీ.
సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్పై విరుచుకుపడ్డారు. అయితే సీఎంకు కౌంటర్గా బన్నీ తన నివాసంలో ప్రెస్మీట్ పెట్టడం మరింత కలకలం రేపింది. ఆ వెంటనే పోలీస్ వర్గాలు .. సంథ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో మినిట్ టూ మినిట్ వీడియో ఫుటేజ్ విడుదల చేయడంతో అల్లు కాంపౌండ్ సైలెంట్ అయ్యింది. ఈ పరిణామాలతో తెలంగాణలో తాను సీఎంగా ఉన్నంత వరకు సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

తెలుగు సినిమా ఆదాయంలో ప్రధాన మార్కెట్ అయిన నైజాం ఏరియాలో సీఎం రేవంత్ రెడ్డి వల్ల పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. దీనిని గ్రహించిన సినీ పెద్దలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అప్పుడు కూడా తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని రేవంత్ రెడ్డి తేల్చేయడంతో సినీ పెద్దలు మౌనం వహించారు. తెలుగు సినిమాకు అతిపెద్ద సీజన్ అయిన సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు లేకుండానే తెలంగాణ ఏరియాలో రిలీజయ్యాయి.
సంథ్య థియేటర్ ఎపిసోడ్ అల్లు కాంపౌండ్పై బాగానే ప్రభావం చూపించిందని ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ టికెట్ ధరల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తాము తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో అక్కడ టికెట్పై రూ.50 పెంచమని ప్రభుత్వాన్ని అడిగామన్నారు. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు రూ.295, రూ.395 స్థాయిలో పెరిగి ఉన్నాయని అందుకే ఇక్కడి ప్రభుత్వాన్ని పెంచమని కోరలేదని అరవింద్ తెలిపారు. తండేల్ సినిమాకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు లేవని.. అంత బెనిఫిట్ కూడా మాకు అవసరం లేదని అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











