అరవింద్ పక్కా బిజినెస్మెన్ .. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ వెనుక, గుట్టువిప్పిన నాగబాబు
మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిత్ర యూనిట్ను ఆశీర్వదించిన ఆయన ఈ ఈవెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్లు ఉండవని.. ఉన్నది సినిమా కాంపౌండేనని చిరు చెప్పారు. ఇక ఇదే వేదికపై ప్రజారాజ్యం పార్టీ.. జనసేనగా రూపాంతరం చెందిందని చిరు తెలిపారు. తన ఆశయాలు, సిద్ధాంతాలు, లక్ష్యాలను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారని మెగాస్టార్ వెల్లడించారు. చిరంజీవి నోటి వెంట ప్రజారాజ్యం టాపిక్ రావడంతో చాలా మంది పీఆర్పీ గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు సినీ వినీలాకాశంలో ధ్రువతారగా, మూడు దశాబ్ధాలకు పైగా టాలీవుడ్ను మకుటం లేని మహారాజుగా ఏలుతున్న చిరంజీవి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లతో ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు చిరు. అయితే రాజ్యాధికారంతోనే బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరుతుందనే ఉద్దేశంతో రాజకీయాల వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు మెగాస్టార్.

2008 ఎన్నికలకు ముందు చిరంజీవి తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దూకారు. అయితే రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో తలపడటం ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో పీఆర్పీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కేవలం 18 స్థానాల్లోనే విజయం సాధించిన చిరు.. తర్వాత పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాష్ట్ర కేబినెట్లో బెర్త్లతో పాటు తను రాజ్యసభకు ఎన్నికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రజారాజ్యం విఫలం కావడం చిరంజీవి మనోభావాలను తీవ్రంగా దెబ్బకొట్టింది. మిగిలినవారి సంగతేమో కానీ పవన్ సైతం పీఆర్పీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు కూడా. కొందరి వల్లే పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చిందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా చిరంజీవి బావమరిది , నిర్మాత అల్లు అరవింద్పై పీఆర్పీ నేతలు, చిరు అభిమానులు బహిరంగంగానే ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం, ప్రజారాజ్యం పార్టీ కథ, మెగాస్టార్పై అల్లు అరవింద్ ప్రభావం గురించి ఆయన సోదరుడు , మెగా బ్రదర్ నాగబాబు ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. అన్నయ్య తొలినాళ్లలో అరవింద్ మాట వినేవారని నాగబాబు చెప్పారు. కానీ ఇప్పటికీ అదే అభిప్రాయం ప్రజల్లో ఉందని.. అది కరెక్ట్ కాదన్నారు. అల్లు అరవింద్ పక్కా బిజినెస్మెన్ అని , ఆయనతో మాది విడదీయరాని అనుబంధం అని నాగబాబు తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ అనేది కలెక్టివ్ మెసేజ్ అని.. దానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. పీఆర్పీ అంశంలో అల్లు అరవింద్ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











