సినీ కార్మికుల సమ్మె ఇష్యూలో ట్విస్ట్ .. వాళ్ల ముసుగులు తొలగించేలా చిరంజీవి షాకింగ్ పోస్ట్
తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. తమ వేతనాలు పెంచాలంటూ గత కొద్దిరోజులుగా కార్మికులు ధర్నా చేస్తున్నారు. సినీ పెద్దలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. షూటింగ్లు నిలిపి వేయాలని నిర్మాతలను ఆదేశించింది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లుగా కొందరు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దీనిపై చిరు స్పందించారు.
30 శాతం వేతనాల పెంపుపై ఫెడరేషన్ పట్టు
సినీ కార్మికులకు వేతనాలను 30 శాతం పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. తమ ప్రతిపాదనకు ఒప్పుకున్న నిర్మాతల సినిమాల షూటింగ్లకు మాత్రమే హాజరవ్వాలని ఫెడరేషన్ నిర్ణయించింది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మిక చట్టాల ప్రకారం.. నైపుణ్యం ఉన్నవారికి, లేని వారికి ఇప్పటికే కనీస వేతనాలను మించి ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపింది. అయినప్పటికీ ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని పేర్కొంది.

ఆదివారం ధర్మాకు ఫెడరేషన్ పిలుపు
నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, ఛాంబర్ పెద్దలు పలు దఫాలుగా చర్చలకు కూర్చొన్నారు. కానీ ఆరు రోజులు కావొస్తున్నా దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ దృష్టికి పలువురు నిర్మాతలు ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ .. ఫెడరేషన్ నాయకులపై కేసులు పెట్టడంతో పరిస్దితి మరింత తీవ్రమైంది. ఆయన తీరుపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఫెడరేషన్ నాయకులు కలిసి సమస్యను వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఆదివారం ఫెడరేషన్ కార్యాలయం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు కార్మికులు ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. తాము కోరిన విధంగా 30 శాతం వేతనాల్ని పెంచి ఇవ్వాల్సిందేనని ఫెడరేషన్ తేల్చి చెబుతోంది.
చిరంజీవి షాకింగ్ పోస్ట్
అయితే ఫెడరేషన్ సభ్యులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు మెగాస్టార్ చిరంజీవి తమ డిమాండ్లకు ఒప్పుకున్నారని, 30 శాతం వేతన పెంపుకు అంగీకరించారని మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. దీనిపై చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు ఓ నోట్ విడుదల చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులమని చెప్పుకుంటున్న కొందరు మీడియా ముందుకు వెళ్లి నేను వారిని కలిసి 30 శాతం వేతన పెంపు సహా పలు డిమాండ్లకు అంగీకరించినట్లుగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు.
ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయమే ఫైనల్
అయితే నేను ఫెడరేషన్కు చెందిన ఏ వ్యక్తిని కలవలేదు.. ఇది ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిన అంశమని.. ఇలాంటి వాటిలో నేను వ్యక్తిగతంగా, ఏకపక్షంగా పరిష్కారం చూపడం అసాధ్యమని చిరంజీవి తేల్చి చెప్పారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన వరకు ఫిల్మ్ ఛాంబరే అత్యున్నత సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడం ఛాంబర్ బాధ్యత అని చిరు పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రజల్లో , సినీ వర్గాల్లో గందరగోళం సృష్టించే ఇలాంటి నిరాధారమైన ప్రకటనలని ఖండిస్తున్నానని.. అంతా గమనించాలని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











