రీ రిలీజ్లో ఇంద్ర రికార్డులు.. క్షణాల్లో టికెట్లు ఖతం, దటీజ్ మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి.. ఆయన ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. తెలుగు సినిమాకు నార్త్లో అంతగా గుర్తింపు లేనిరోజుల్లోనే మెగాస్టార్ తన మాస్ మూవీస్తో బాలీవుడ్ను వణికించారు. భారతదేశంలో రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటుడిగా బిగ్గెర్ దెన్ బిగ్బీ చరిత్ర సృష్టించి.. యావత్ దేశాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు. తెలుగులో రూ.10 కోట్ల వసూళ్లు సాదించిన తొలి హీరోగా, ఆస్కార్ అవార్డ్ వేడుకలకు ఇన్విటేషన్ అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా.. ఇలా చిరంజీవి పేరిట ఎన్నో రికార్డులు.
150కి పైగా సినిమాలు చేయగా.. వాటిలో అపజయాల కంటే విజయాలే ఎక్కువ. ఆయన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, మరెన్నో బ్లాక్ బస్టర్స్. అలాంటి వాటిలో ఇంద్ర ఒకటి. 22 ఏళ్ల క్రితం
బీ.గోపాల్ దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చిరంజీవి నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుని అప్పటి వరకు దక్షిణాదిలో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది.

ఆ రోజుల్లో టికెట్ ధర రూ.5, రూ.10 ఉండేది కాబట్టి.. కలెక్షన్స్ అక్కడితో ఆగిపోయాయి కానీ అదే ఈ రోజుల్లో అయితే సింపుల్గా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు కొట్టేసేదని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. అప్పట్లో చిరంజీవి మేనియా ఎలా ఉండేదంటే.. మదనపల్లికి చెందిన ఓ వీరాభిమాని ఇంద్ర సినిమా టికెట్ని బ్లాక్లో రూ.2000 వేలు పెట్టి కొన్నాడట.. అలా మొత్తం 5 టికెట్ల కోసం రూ.10 వేలు ఖర్చు చేశాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బీ గోపాల్ స్వయంగా తెలియజేశారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మించిన ఇంద్రలో సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్స్ థియేటర్స్ని షేక్ చేశాయి. ఇందులోని దాయి దాయి దామ్మ అనే పాటలో మెగాస్టార్ వీణ స్టెప్.. తెలుగు ఇండస్ట్రీలోని ఆల్టైమ్ బెస్ట్ డ్యాన్సింగ్ మూవ్మెంట్గా నిలిచింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఈ స్టెప్ వేస్తూ ఉంటారు. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుండటంతో ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఇంద్రను రీ రిలీజ్ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున ఇంద్రను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రీ రిలీజ్లోనూ ఇంద్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల హౌస్ఫుల్స్ అవుతుండగా.. హైదరాబాద్లోని చాలా చోట్ల సోల్డ్ అవుట్స్ కనిపిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. నగరంలోని ఫేమస్ థియేటర్లైన సంధ్య, శ్రీరాములు, భ్రమరాంభ వంటి చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇదే పరిస్ధితి చాలా చోట్ల ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం 24 గంటల్లోనే 12 వేలకు పైగా టికెట్లు సేల్ అవ్వగా.. ఈ బుకింగ్స్తోనే దాదాపు రూ. 40 లక్షల నుంచి రూ. కోటి వరకు వసూలైనట్లుగా తెలుస్తోంది. డిమాండ్ నేపథ్యంలో అదనంగా స్క్రీన్లు, షోలను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











