చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై రూమర్స్.. నాగబాబు క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కోసం ఎప్పుడూ ఏదో ఒక పుకారు వైరల్ అవుతూనే ఉంటుంది. అది సినిమాలకు సంబంధించి కావొచ్చు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కావొచ్చు. అయితే చిరంజీవి తల్లి అంజనా దేవిని కూడా కొందరు వదిలిపెట్టడం లేదు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆసుపత్రి పాలయ్యారని రకరకాల గాసిప్స్ వైరల్ చేస్తున్నారు. తాజాగా మరోసారి పెద్దావిడ ఆరోగ్యంపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి ఈ వయసులోనూ ఎంతో యాక్టీవ్గా ఉంటారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతుంటారు. మహిళా దినోత్సవం, మాతృ దినోత్సం సందర్భంగా తమ తల్లిని తలచుకుంటూ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇక తల్లి పుట్టినరోజు వేడుకలను చిరంజీవి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే షూటింగ్స్ లేనప్పుడు తల్లికి ఇష్టమైన వంటకాలు చేసి పెడుతూ ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అటు పవన్ కళ్యాణ్కు కూడా తన తల్లితో అనుబంధం ఎక్కువ. జనసేన పార్టీని స్థాపించిన కొత్తలో తనకు వచ్చే పెన్షన్ నుంచి కొత్త మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు అంజనా దేవి.

అంజనా దేవికి అస్వస్థతకు అంటూ గాసిప్స్
తాజాగా జూన్ 24న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో కూడా పెద్దావిడ గురించి ఇదే తరహాలో వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ పుకార్లను మెగా కుటుంబం ఖండించింది. అంజనా దేవి క్షేమంగా ఉన్నారని.. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు క్లారిటీ ఇచ్చింది. తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో జరుగుతున్న కేబినెట్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్కు బయల్దేరినట్లుగా వార్తలు వచ్చాయి.
అవకాయ టేస్ట్ చూసిన అంజనా దేవి
ఈ వార్తలు ఇలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే అంజనా దేవి తన కోడలు సురేఖ, మనవడు రామ్ చరణ్ అతని సతీమణి ఉపాసనతో సంతోషంగా ఉన్న వీడియో బయటికి వచ్చింది. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో సురేఖ పచ్చళ్ల ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా అవకాయ పచ్చడి పెట్టిన వీడియోను ఉపాసన షేర్ చేశారు. సురేఖ, అంజనా దేవిలు అన్నం పెట్టుకుని అవకాయ వేసుకుని రుచి చూశారు. దానిని రామ్ చరణ్, ఉపాసనలతో పాటు అక్కడ పనిచేస్తున్న అందరికీ పెట్టారు.
స్పందించిన నాగబాబు
ఈ వీడియోలో సురేఖ, అంజనా దేవిలు అవకాయ టేస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా చరణ్కు ఉపాసన కంప్లయింట్ చేయడం చూడొచ్చు. ఇంతలోనే అంజనా దేవి అస్వస్థతకు గురైనట్లుగా వార్తలు రావడం కలకలం రేపింది. ఈ కథనాలపై అంజనా దేవి రెండో కుమారుడు, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అంజనా దేవి క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో మెగా అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











