చిరంజీవి ఇంట్లో పీవీ సింధుకు బిగ్ సర్ప్రైజ్: ఆ సినీ ప్రముఖుల ముందే బహుమానం
దాదాపు నలభై ఏళ్లుగా హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఆరు పదుల వయసులోనూ ఎంతో వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. తద్వారా తనలో వాడీ వేడీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్లో ఉన్న ఈ స్టార్ హీరో చిరంజీవి.. ఏక కాలంలో వరుసగా మూడు నాలుగు చిత్రాలను లైన్లో పెట్టుకున్నారు. దీంతో వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఎప్పుడూ సినిమా వ్యవహారాలతోనే బిజీ బిజీగా గడిపే మెగాస్టార్ చిరంజీవి.. మిగిలిన విషయాలపైనా బాగానే ఫోకస్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలపై స్పందిస్తుంటారు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ అంటే ఇష్టపడే ఆయన.. ఎంతో మంది ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిన బాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు)ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ప్రత్యేకమైన ఫంక్షన్ను నిర్వహించారు.

కొన్నేళ్లుగా బాడ్మింటన్లో వరుస విజయాలను అందుకోవడంతో పాటు ఏకంగా రెండు ఒలంపిక్స్లో కాంస్య పతకాలను గెలుచుకున్న పీవీ సింధు కోసం హైదరాబాద్లోని తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ ఫంక్షన్కు సినీ, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో పీవీ సింధును ఆయన సన్మానించారు. ఇందులో భాగంగానే శాలువాతో సత్కరించిన తర్వాత ఆమెకు అమ్మవారి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆంద్యంతం ఎంతో సందడిగా సాగింది.
పీవీ సింధును సన్మానించడానికి ముందు ఆమె తన కాంస్య పతకాన్ని అక్కడున్న ప్రముఖులు అందరికీ చూపించింది. ఆ సమయంలో వాళ్లంతా ఆ ప్రతిష్టాత్మకమైన మెడల్ను పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అదే సమయంలో వీళ్లంతా పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో ఆమె కూడా ఎంతో మురిసిపోయింది. ఇక, ఒలంపిక్ పతకాన్ని సాధించిన క్రీడాకారిణిని సన్మానించిన మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్తో పాటు సినీ, క్రీడా ప్రియులు ప్రశంసిస్తున్నారు. అలాగే, నైపుణ్యం ఉన్న వాళ్లందరినీ ఇదే తరహాలో ప్రోత్సహించి అభినందించాలని కోరుతున్నారు.
పీవీ సింధు సన్మానానికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇక, ఎంతో సందడిగా సాగిన ఈ ఫంక్షన్లో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి రానా, అక్కినేని అఖిల్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సుహాసిని, రాధిక, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. అలాగే, ప్రముఖ దర్శక నిర్మాత సుబ్బిరామి రెడ్డి, క్రీడా ప్రముఖులు మహ్మద్ అజారుద్దీన్, చాముండీ సహా కొంత మంది విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











