రికార్డులు తాత్కాలికం.. మీరే శాశ్వతం.... శంకర వరప్రసాద్ గారు హిట్పై చిరంజీవి ఎమోషనల్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలై ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్లోనే తొలి 300 కోట్ల రూపాయల సినిమాగా నిలవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ లాభాలను అందించింది. చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో? ఆ వింటేజ్ లుక్లో చూపించి మెగా అభిమానులకు ఫుల్ ఫీస్ట్ అందించారు అనిల్. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం హిట్పై చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు, తమ్మిరాజు ఎడిటర్గా పనిచేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి సరసన లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో అలరించారు. వీరితో పాటు కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్లు తదితరులు నటించారు.

జనవరి 12న రిలీజైన నాటి నుంచి నేటి వరకు థియేటర్లలో చిరంజీవి మేనియా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఇండియాలో 165.9 కోట్ల రూపాయల నెట్.. 197.1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్లో ఏకంగా 36.15 కోట్ల రూపాయల వసూళ్లు కలిపి వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 233.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్నిక్ తెలిపింది. అయితే మన శంకర వరప్రసాద్ చిత్రం వరల్డ్ వైడ్గా 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నిర్మాతలు తెలిపారు.
మన శంకర వరప్రసాద్ గారు మూవీతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను బద్ధలు కొట్టారు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ తర్వాత 300 కోట్ల వసూళ్లు సాధించిన హీరోగా నిలిచారు. అలాగే సైరా నర్సింహారెడ్డి తర్వాత తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన చిరంజీవి సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. ఆర్ఆర్ఆర్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు సాధించిన స్థాయిలో వారం రోజుల పాటు ప్రతిరోజూ 30 కోట్ల రూపాయలకు తగ్గకుండా వసూళ్లు సాధించిన రీజనల్ సినిమాగా శంకర వరప్రసాద్ నిలిచింది. ఇంకా మరెన్నో రికార్డులు చిరంజీవి ఖాతాలో పడ్డాయి. ఈ సినిమా ఊపు చూస్తుంటే అవలీలగా 400 కోట్ల మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మన శంకర వరప్రసాద్ గారు భారీ విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఈయన ఓ నోట్ విడుదల చేశారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే- నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైనప తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణ సమామైనా అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది, ముఖ్యంగా దశాబ్ధాలుగా నా వెంట నిలబడి ఉన్న వారందరిది అని చిరంజీవి అన్నారు.
వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో ... లవ్ యూ ఆల్ అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











