చిరంజీవికి రెండ్రోజుల గ్యాప్లో రెండు అవార్డ్స్ .. మళ్లీ రుజువైన క్లీంకార సెంటిమెంట్!
మెగా అభిమానులు కలలో కూడా ఊహించని సంఘటన ఈ ఆదివారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారం వరించింది. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ప్రపంచంలో మరే నటుడికి సాధ్యం కానీ ఘనతను సాధించినందుకు గాను ఆయనను ఈ అవార్డ్ వరించింది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్ చేతుల మీదుగా ఆయనకు గిన్నిస్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కుమార్తె క్లీంకార మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె అదృష్టం వల్లే మెగా ఫ్యామిలీలో శుభకార్యాలు జరుగుతున్నాయని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ వివరాల్లోకి వెళితే :
గొడ్డొచ్చిన వేళ.. బిడ్డొచ్చిన వేళ అని మన పెద్దలు అంటూ ఉంటారు. కొందరి ఇళ్లలో ఆడపిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు విపరీతంగా కలసొస్తుంది. చరణ్ కుమార్తె క్లీంకార విషయంలో ఇప్పుడు ఇదే నిజమని అంటున్నారు మెగా అభిమానులు. పెళ్లయిన దాదాపు 10 ఏళ్లకు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ - ఉపాసన దంపతులయ్యారు. గతేడాది జూన్ 20న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాపకు లలితా దేవి నామాల్లో ఒకటైన '' క్లింకారా '' అని పేరు పెట్టుకున్నారు చెర్రీ - ఉపాసన.

చిన్నారి పుట్టిన నాటి నుంచి మెగా కుటుంబంలో వరుసపెట్టి అన్నీ శుభాలే జరుగుతూ ఉండటంతో పాప లక్కీ లక్ష్మీగా మారిపోయింది. దీనికి పలు ఉదాహరణలను మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. క్లింకారా తల్లి గర్భంలోనే ఉండగా రాంచరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ప్రపంచ ప్రఖ్యాత 'ఆస్కార్' అవార్డ్ లభించింది. ఈ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్గా మారిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకు చిరంజీవి సోదరుడు నాగబాబు - లావణ్య త్రిపాఠిల వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్గా జరిగింది. చాలా రోజుల తర్వాత మెగా - అల్లు కుటుంబాలు ఒకే వేదికపై చేరి పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి.
అనంతరం మెగాస్టార్ చిరంజీవిని భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు పదేళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రెండ్రోజుల క్రితం దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకార్ధం ప్రతి ఏటా ఇచ్చే ఏఎన్ఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసినట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన జరగనున్న కార్యక్రమంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తామని నాగ్ తెలిపారు.

ఇది జరిగిన రెండ్రోజులకే అమీర్ఖాన్ - చిరంజీవి కలిసి ఆదివారం హైదరాబాద్లో కీలక ప్రెస్ మీట్ పెడుతున్నారని వార్తలు వచ్చేసరికి ఏం జరగబోతుందా అని అభిమానులు, సినీ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ కొద్దిసేపటికే చిరంజీవి పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కినట్లుగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ షాకయ్యారు. ఇది మెగా ఫ్యామిలీ కానీ, అభిమానులు కానీ కలలో కూడా ఊహించని అరుదైన పురస్కారం. క్లీంకారా అదృష్టం వల్లనే మెగా ఫ్యామిలీలో ఈ శుభాలన్నీ జరుగుతున్నాయని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.


Click it and Unblock the Notifications











