అర్థరాత్రి వేళ.. నాగార్జునకు కొండా సురేఖ ట్వీట్.. నాకు ఆ ఉద్దేశ్యం లేదంటూ..
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నాగార్జున కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో కొండా సురేఖ వివాదంలో చిక్కుకున్నారు. ఆ సమస్య కోర్టులో ఉంది.తాజాగా ఆ వివాదంపై కొండా సురేఖ మరోసారి స్పందించారు.ఇంతకీ ఏమన్నారంటే?
మంగళవారం అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "నాగార్జున గారు, ఆయన కుటుంబ సభ్యులపై నేను చేసిన వ్యాఖ్యలు వారిని బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో చెప్పినవి కావు. వారి పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. నా మాటల వలన ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే దానికి చింతిస్తున్నాను. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాగే ఈ అంశం చర్చనీయంగా మారింది. ఎందుకంటే, రేపు (గురువారం) నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్ పై విచారణ జరగనుంది. విచారణకు ముందు రోజు సురేఖ చేసిన ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో, సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
వివాదం ఎలా మొదలైంది?
కొద్దిరోజుల క్రితం మంత్రి సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో, అనుబంధంగా నాగచైతన్య-సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయని భావించిన నాగార్జున, తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన న్యాయపరమైన చర్యలకు దిగుతూ, సురేఖపై పరువునష్టం దావా దాఖలు చేశారు. ఇందులో సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్స్, సోషల్ మీడియా లింక్స్ వంటి ఆధారాలను సమర్పించారు.
కోర్టు విచారణలో ఏం జరిగింది?
నాంపల్లి స్పెషల్ కోర్టులో ఈ కేసుపై విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. కోర్టు క్రిమినల్ డిఫమేషన్ సెక్షన్ 356 కింద సురేఖపై నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై 2025 నవంబర్ 13న (గురువారం) మళ్లీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ముందు రోజే మంత్రి సురేఖ "క్షమాపణలు" చెబుతూ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం - రాజకీయంగా, న్యాయపరంగా కూడా వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.
హాట్ టాపిక్గా మారిన సురేఖ ట్వీట్
సురేఖ తన ట్వీట్లో నాగార్జునను నేరుగా ట్యాగ్ చేస్తూ క్షమాపణ చెప్పడం, "నా ఉద్దేశ్యం అపకీర్తి కాదు" అని చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా చర్చిస్తున్నారు. కొందరు "క్షమాపణ చెప్పడం మంచిది" అంటుంటే, మరికొందరు "కోర్టు ముందు ఇలాగే క్షమాపణ చెప్పడం ఒక న్యాయ వ్యూహం" అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి నాగార్జున స్పందనపై ఉంది. మంత్రి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పరువునష్టం కేసు విత్డ్రా చేసుకుంటారా? లేక విచారణను కొనసాగిస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. నాగార్జున ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. నాగార్జున, అతని కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











