ఐదేళ్లలో మంత్రి రోజా ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా..?
వైసీపీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా తనదైన ముద్ర వేశారామె. 1990ల్లో రోజా టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
టీడీపీ తరుఫున తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన రోజా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నాయకుల వల్లే తాను ఓడిపోయనని విమర్శలు చేసి మరీ ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆ తరువాత వైఎస్. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారామె. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వైసీపీలో కీలక నాయకురాలుగా ఎదిగిన రోజా..టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై తనదైనశైలిలో విమర్శలు చేస్తుంటారు. ఇక ఇదే సమయంలో జగన్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలు జగన్కు ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో రోజాకు టికెట్ దక్కుతుందో లేదో అనే ఉత్కంఠ కొనసాగింది. కానీ సీఎం జగన్ నగరి టికెట్ను తిరిగి రోజాకే కేటాయించడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.

దీంతో రోజా మరోసారి నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో మంత్రి పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది. ఇందులో చరాస్తులు రూ.5.09 కోట్లు, స్థిరాస్తులు రూ.7.08 కోట్లని తెలిపారు. రూ. కోటి విలువైన బెంజ్తో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదువుకున్నానని ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











