పూజా హెగ్డే,మృణాల్ సినిమాకు బిగ్ షాక్.. రూ.400 కోట్ల దావా!
సినీ ఇండస్ట్రీలో సినిమాలు, వివాదాలు ఒకదానితో ఒకటి విడదీయరాని బంధంలా మారిపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. అలా తాజాగా వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా చుట్టూ నెలకొన్న వివాదం నెలకొంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ వివాదం పెద్ద చర్చకు దారితీసింది. విడుదలకు కేవలం కొన్ని రోజుల ముందు ఈ సినిమాపై ఏకంగా రూ.400 కోట్ల దావా పడింది. అసలేం జరిగిందంటే..?
సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ హై జవానీ తో ఇష్క్ హోనా హై. ఈ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో డేవిడ్ ధావన్-వరుణ్ ధావన్ కాంబినేషన్లో వచ్చిన 'మై తేరా హీరో', 'జుడ్వా 2', 'కూలీ నంబర్ 1' సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదలకు ముందు ఊహించని విధంగా కాపీరైట్ వివాదం ఈ సినిమాను చిక్కుల్లోకి నెట్టింది.

ఈ వివాదంతో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. 1999లో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'బీవీ నంబర్ 1'లోని 'చునరీ చునరీ' పాట ఎలాంటి మ్యూజికల్ హిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్లపై షూట్ చేసిన ఈ పాట ఇప్పటికీ బాలీవుడ్లో ఎవర్గ్రీన్ హిట్గా నిలిచింది. అయితే అదే పాటను 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమాలో రీమిక్స్ రూపంలో ఉపయోగించారని, అందుకు తమ అనుమతి తీసుకోలేదని పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వాషు భగ్నానీ ఆరోపిస్తున్నారు.
పాట మాత్రమే కాదు, కొత్త సినిమా టైటిల్ కూడా 'బీవీ నంబర్ 1'లోని ప్రముఖ డైలాగ్ లేదా లైన్ ఆధారంగా పెట్టారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ దర్శకుడు డేవిడ్ ధావన్పై రూ.400 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు, సినిమా విడుదల తర్వాత కూడా ఆ పాటను కొనసాగిస్తే అదనంగా మరో రూ.100 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం హక్కుల వివాదం.. పూజా ఎంటర్టైన్మెంట్స్ లీగల్ టీమ్ ప్రకారం, అప్పట్లో 'బీవీ నంబర్ 1' పాటలకు సంబంధించిన ఆడియో హక్కులను మాత్రమే టిప్స్ ఇండస్ట్రీస్కు విక్రయించారట. కానీ ప్రస్తుతం టిప్స్ సంస్థ వీడియో హక్కులను కూడా వినియోగిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దీనిని చట్టవిరుద్ధ చర్యగా పేర్కొంటూ చీటింగ్, ఫోర్జరీ వంటి ఆరోపణలు కూడా చేశారు.
అయితే టిప్స్ ఇండస్ట్రీస్ అధినేత రమేష్ తౌరానీ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. తమ వద్ద అన్ని హక్కులు చట్టబద్ధంగానే ఉన్నాయని, సుప్రీంకోర్టు నుంచి కూడా తమకు అనుకూలంగా ఉత్తర్వులు లభించాయని చెబుతున్నారు. ఈ వివాదం సినిమా విడుదలను ప్రభావితం చేయదని, జూన్ 5న సినిమా అనుకున్న తేదీకే విడుదల అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఈ వివాదంలో వాషు భగ్నానీ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. డేవిడ్ ధావన్ తనకు చాలా సన్నిహితుడని, కనీసం ఒక ఫోన్ కాల్ చేసి అనుమతి అడిగి ఉంటే తానే ఉచితంగా ఎన్ఓసీ ఇచ్చేవాడినని అన్నారు. ఇది కేవలం డబ్బు కోసం చేసే పోరాటం కాదని, పరిశ్రమలో మేధో సంపత్తి హక్కులు, నైతిక విలువలను కాపాడేందుకు చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ముంబై కోర్టులో కొనసాగుతోంది. ఒకవైపు పూజా ఎంటర్టైన్మెంట్స్, మరోవైపు టిప్స్ ఇండస్ట్రీస్, మూవీ మేకర్స్ తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందు మొదలైన ఈ లీగల్ వార్ సినిమా ప్రచారానికి అదనపు హైప్ తీసుకొచ్చినప్పటికీ, తుది తీర్పు ఎటు తిరుగుతుందనే ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. ఒక పాట, ఒక టైటిల్ కారణంగా మొదలైన ఈ వివాదం చివరకు ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications






