పుష్ప 3 రిలీజ్ డేట్ లీక్.. అల్లు అర్జున్ మూవీ థియేటర్లలోకి ఎప్పుడంటే?
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో సౌత్ కంటే బాలీవుడ్ చాలా ముందుంది. గతంలో క్రిష్, ధూమ్, స్త్రీ , గదర్ వంటి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించడంతో దర్శక నిర్మాతలు సీక్వెల్స్కు ప్లాన్ చేసి భారీ లాభాలు కళ్లజూశారు. ఇక సౌత్ విషయానికి వస్తే బాహుబలి 2, కేజీఎఫ్ 2, మునీ సిరీస్ వంటివి బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్లోకి చేరింది పుష్ప . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో నాలుగేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే.
పుష్పకి సీక్వెల్గా పుష్ప 2ను సెట్స్ మీదకి తీసుకెళ్లింది సుకుమార్- అల్లు అర్జున్ జోడీ. 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయిలో రూ. 294 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది. థియేట్రికల్ రన్ ముగిసేనాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1870 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాల చరిత్రలో దంగల్ (రూ.2000 కోట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ బలపడటంతో పాటు పుష్ప ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ఏర్పడిన బ్రాండ్ నేపథ్యంలో పుష్ప 3ని కూడా తెరకెక్కించాలని సుకుమార్ నిర్ణయించారు. దీనిలో భాగంగా పుష్ప 2 ఎండింగ్లోనే పుష్ప పార్ట్ 3 ఉంటుందని హింట్ ఇచ్చేశారు. పుష్ప రాజ్ని తన అన్నయ్యలు తమ కుటుంబంలో ఒకడిగా కలుపుకోవడంతో పాటు ఇంటి పేరును కూడా ఇస్తారు. తన అన్న కూతురు కావేరి పెళ్లికి పుష్ప రాజ్ తన తల్లి, భార్యలతో కలిసి హాజరవుతాడు.
ఇంతలో కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డి తన తమ్ముడు, తన తమ్ముడి కొడుక్కీ పిండం పెడుతుంటాడు. ఈ కార్యక్రమానికి మంగళం శ్రీను, దాక్షాయణి సహా సిండికేట్ మొత్తం హాజరవుతుంది. అందరూ వచ్చారు కానీ వాడెక్కడ అని జగపతి బాబు అడుగుతాడు. ఆ వెంటనే ముసుగు వేసుకున్న వ్యక్తి రిమోట్ స్విచ్ ఆన్ చేయగానే పుష్పరాజ్ కుటుంబం ఉన్న కళ్యాణ మంటపం మొత్తం పేలిపోతుంది. ఆ వెంటనే పుష్ప 3 అన్న టైటిల్ పడుతుంది.
ఆ రిమోట్ ఆపరేట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎస్పీ భన్వర్సింగ్ షెకావత్ చనిపోలేదా? లేదంటే మరో కొత్త వ్యక్తి విలన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటూ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 3 ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది? రిలీజ్ ఎప్పుడు ? అంటూ అల్లు అర్జున్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్లో ఒకరైన రవిశంకర్ .. పుష్ప 3 విడుదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నితిన్ , శ్రీలీల జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న రాబిన్హుడ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ వెళ్లిన రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. 2028లో పుష్ప 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రవిశంకర్ తెలిపారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారని .. వాటిని పూర్తి చేసిన వెంటనే పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











