స్వర్గీయ ఎస్వీ రంగారావు చరిత్ర భావి తరాలకు మార్గదర్శకం.. ఎం వెంకయ్యనాయుడు
తెలుగు జాతి గర్వించ దగిన, ప్రముఖ నటులు స్వర్గీయ ఎస్వీ రంగారావు గారిపై ప్రఖ్యాత సినీ పరిశోధకులు సంజయ్ కిషోర్ రచించి, సేకరించి, రూపొందించిన మహానటుడు ఫొటో బయోగ్రఫీ పుస్తకంపై ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ప్రశంసల జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటన సందర్భంగా రచయిత సంజయ్ కిషోర్ ప్రత్యేకంగా కలిసి పుస్తకాన్ని బహుకరించారు. సంజయ్ కిశోర్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తెలుగుజాతి మరిచిపోలేని, మరిచిపోకూడదని గొప్ప నటుడు శ్రీ ఎస్వీ రంగారావు. అలాంటి కళాకారుడి చరిత్రను నిక్షిప్తం చేయడం ఎంతో అవసరం. ఎన్నో ఏళ్లుగా శ్రమించి, ఛాయా చిత్రాలతో ఆకర్షణీయంగా రూపొందించబడిన ఈ మహానటుడు పుస్తకం నేటి, రాబోయే తరాలకు ఎంతో ఉపయోగకరం. పుస్తక రచయిత సంజయ్ కిషోర్కు నా ప్రత్యేక అభినందనలు అని అన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్ను ఉపరాష్ట్రపతి ప్రత్యేక శాలువతో సత్కరించి, అభినందించారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు, గాయకుడు డాక్టర్ బంటీ, భారతీయ రైల్వేస్ ఉన్నతాధికారి శ్రీ రవి పాడి పాల్గొన్నారు.

కొద్దివారాల క్రితం మహానటుడు ఫొటో బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, ఆలీ, రేలంగి నర్సింహారావు, రావి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











