Game Changer : మెగా ఫ్యాన్స్కి షాకిచ్చిన శంకర్ ... గేమ్ ఛేంజర్లో భారీ మార్పు
తమిళ దర్శక దిగ్గజం శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైంది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయుడు -2, గేమ్ ఛేంజర్లను ఓకేసారి పూర్తి చేయాలని అనుకున్న శంకర్.. తర్వాత భారతీయుడును కంప్లీట్ చేసి తర్వాత చరణ్ మూవీపై ఫోకస్ పెట్టారు. గత కొన్నేళ్లుగా తన దర్శకత్వం మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి సాలీడ్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ సినిమాను తీశాడు శంకర్.
దక్షిణాదిలోని మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్పై టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. పైగా ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో గేమ్ ఛేంజర్ పైనా ఒత్తిడి ఉంది. పుష్ప 2 ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ను రాబట్టడంతో గేమ్ ఛేంజర్ ఎన్ని కోట్లు సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి , ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో గేమ్ ఛేంజర్ నిర్మించారు.

శంకర్ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన సినిమాలు భారీ విజువల్ ఎఫెక్ట్స్తో గ్రాండీయర్గా ఉంటాయి. తన హై స్టాండర్డ్ సినిమాలతో దక్షిణ భారత సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అన్నింటిలోకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శంకర్ సినిమాలోని పాటల గురించి. ఆయన సినిమాల్లో మెజారిటీ ఖర్చు పాటల కోసమే పెడతారు అనడంలో అతిశయోక్తి లేదు. సాహిత్యం, సంగీతంతో పాటు చిత్రీకరణలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు శంకర్. అందుకే వాటికి అంతటి ఫ్రెష్ లుక్ ఉంటుంది.
గేమ్ ఛేంజర్లోనూ పాటలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు శంకర్. ఈ సినిమా బడ్జెట్ రూ.450 కోట్ల పై మాటే.. అలాంటిది ఇందులో రూ. 75 కోట్లను పాటల పైనే ఖర్చు చేసినట్లు టాలీవుడ్ టాక్. ఇక అన్నింటిలోకి నానా హైరానా సాంగ్ ఎవర్ గ్రీన్గా నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన సాంగ్గా నానా హైరానా నిలిచింది. న్యూజిలాండ్లో అద్భుతమైన లోకేషన్లలో దాదాపు వారం రోజుల పాటు రామ్ చరణ్ - కియారాలపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్లో సెట్టింగ్స్, ఇతర విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లుగా సమాచారం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా.. కార్తీక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. విడుదలైన నాటి నుంచి కోట్లాది వూస్ను ఈ పాట సొంతం చేసుకుంది.

గేమ్ ఛేంజర్ను చూడాలని అభిమానులు ఎంతగా ఆశపడ్డారో.. హైరానా పాటను స్క్రీన్పై చూడాలని కూడా అంతే కోరుకున్నారు. అలాంటిది మెగా ఫ్యాన్స్కి చిత్ర యూనిట్ షాకిచ్చింది. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుడికి ఆ పాట కనిపించకపోవడంతో వారంతా ఉలిక్కిపడ్డారు. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల హైరానా పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని, జనవరి 14 నుంచి ఈ పాట అందుబాటులోకి ఉంటుందని గేమ్ ఛేంజర్ యూనిట్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











