ఆ నేరం ఎవరిది? శివాజీ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ షాకింగ్ కామెంట్స్..
Naga Babu-Sivaji: మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ అంశంపై మౌనం వీడిన ఆయన, సమాజంలో ఇంకా బలంగా కొనసాగుతున్న పురుషాధిక్య ఆలోచనలను తీవ్రంగా ఖండించారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలనే విషయంపై ఎవరికీ సూచనలు చేసే హక్కు లేదని స్పష్టం చేస్తూ, ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి పెద్ద చర్చకు దారి తీస్తోంది.
నాగబాబు తన వీడియోలో, తాను రాజకీయ నాయకుడిగా గానీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడిగా గానీ కాకుండా, ఒక సామాన్య పౌరుడిగా ఈ అంశంపై మాట్లాడుతున్నానని స్పష్టంచేశారు. ఇటీవల మహిళల దుస్తులపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సమాజంలో ప్రమాదకరమైన ఆలోచనలకు దారి తీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శివాజీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇవి మోరల్ పోలీసింగ్కు దారితీసే మాటలని, ఇలాంటి ఆలోచనలు సమాజానికి హానికరమని అన్నారు.

'ఆడపిల్ల ఎలా ఉండాలి, ఏ దుస్తులు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అన్నదానిపై ప్రతి ఒక్కరూ తీర్పులు చెప్పడం మానాలి. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. మహిళల స్వేచ్ఛను కట్టడి చేసే హక్కు ఎవరికీ లేదు'అని నాగబాబు వ్యాఖ్యానించారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలో చెప్పే అధికారం పురుషులకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని సమర్థించే మహిళలను చూసి తనకు బాధ కలుగుతుందని కూడా చెప్పారు. సమాజం ఏమనుకుంటుందో, భర్త ఏమనుకుంటాడో అన్న భయంతో కొందరు మహిళలు కూడా ఈ మోరల్ పోలీసింగ్కు మద్దతు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యాషన్ కాలానుగుణంగా మారుతుందన్న నాగబాబు, మహిళల దుస్తులను బట్టి వారి క్యారెక్టర్ను అంచనా వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఒకప్పుడు తానూ ఇలాంటి ఆలోచనలతోనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని, కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తర్వాత తన ఆలోచనలను మార్చుకున్నానని చెప్పారు. 'నాకేం హక్కు ఉంది మహిళల గురించి తీర్పులు చెప్పడానికి?' అని తాను తనను తానే ప్రశ్నించుకున్నానని తెలిపారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వారి దుస్తుల వల్ల కాదని, అది పూర్తిగా పురుషుల క్రూరత్వం, పశుబుద్ధి వల్లేనని నాగబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. కొంతమంది పురుషులు మహిళలను విలాస వస్తువుల్లా చూస్తున్నారని, అలాంటి ఆలోచనలు ఉన్నవారికి మహిళ ఏ దుస్తులు వేసుకున్నా తేడా ఉండదని అన్నారు. సమస్య మహిళల దుస్తుల్లో కాదని, మగవారి ఆలోచనల్లో ఉందని స్పష్టం చేశారు.
ఇప్పటి సమాజం ఇంకా మహిళలను పూర్తిగా రక్షించే స్థాయికి చేరలేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మహిళలు తమ భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని సూచించారు. అయితే దీన్ని మహిళలపై భారం వేయడంగా చూడకూడదని, ప్రభుత్వాలు సరైన రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయనే నిజాన్ని గుర్తించాలన్నారు.
మనం ప్రస్తుతం ఏఐ జనరేషన్లో ఉన్నామని, అయినా మహిళలపై పాతకాలపు ఆలోచనలతో మాట్లాడే పురుషుల మనస్తత్వాన్ని ఇకనైనా ఖండించాలని నాగబాబు పిలుపునిచ్చారు. 'ఆడవారిని అవమానించిన ఏ మగవాడు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ద్రౌపదిని అవమానించిన కౌరవుల గతి మనందరికీ తెలుసు'అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వీడియోలో హైలైట్గా నిలిచాయి.
ఈ విషయాలపై మాట్లాడితే విమర్శలు వస్తాయని తెలిసినా, మౌనంగా ఉండటం తప్పేనని నాగబాబు చెప్పారు. మహిళల స్వేచ్ఛను హరించే మాటలు మాట్లాడటం నేరమని, అలాంటి ఆలోచనలను సమర్థించడం కూడా అంతే ప్రమాదకరమని హెచ్చరించారు. మహిళలు ఇకనైనా ప్రశ్నించాలని, మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మొత్తానికి.. మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలకు ప్రతిగా నాగబాబు చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలు సమాజంలో జరుగుతున్న మోరల్ పోలీసింగ్, లింగ వివక్షపై మరోసారి పెద్ద చర్చను తెరపైకి తెచ్చాయి. మహిళల స్వేచ్ఛ, గౌరవం, భద్రతపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన చేసిన పిలుపు ప్రస్తుతం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











