శోభితపై మరోసారి ప్రేమను చాటుకున్న నాగ చైతన్య.. ఆ పోస్ట్తో ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లోని మోస్ట్ బ్యూటీపుల్ కపుల్స్లో ముందుగా గుర్తుకొచ్చే పేర్లలో అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ జంట ఒకటి. 2024 డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు పంచుకోని నాగ చైతన్య, తాజాగా భార్య శోభిత పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ స్పెషల్ పోస్ట్ ఏంటీ ?
నేడు (మే 31న) శోభిత తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు నాగ చైతన్య ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ మై లేడీ శోభితా.. నా జీవిత ప్రయాణాన్ని నీతో కలిసి పంచుకునే అవకాశం దక్కినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
’

చైతూ చేసిన ఈ ఒక్క పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చైతన్య షేర్ చేసిన ఫోటోల్లో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, స్నేహం, ప్రేమ స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. "మేడ్ ఫర్ ఈచ్ అదర్", "క్యూటెస్ట్ కపుల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక శోభిత ధూళిపాళ గురించి చెప్పాలంటే.. ఆమె కేవలం స్టార్ హీరో భార్య మాత్రమే కాదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటీమణి. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించిన శోభిత చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి విశాఖపట్నంకు వెళ్లింది. ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీలో ఉద్యోగం చేయగా, తల్లి కామాక్షి స్కూల్ టీచర్గా పనిచేశారు. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న శోభిత కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలను అభ్యసించింది.
16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లిన శోభిత జీవితంలో అసలు మలుపు 2013లో వచ్చింది. ఆ ఏడాది జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ను గెలుచుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత మోడలింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆమె, క్రమంగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో తన కెరీర్ ప్రారంభించింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫారమ్లలో ఆమెకు వచ్చిన గుర్తింపు మరింత ప్రత్యేకం. 'మేడ్ ఇన్ హెవెన్' వెబ్ సిరీస్లో తారా ఖన్నా పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం 'ది నైట్ మేనేజర్' సిరీస్లో కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ రెండు ప్రాజెక్టులు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి.
అంతేకాకుండా హాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దేవ్ పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మంకీ మ్యాన్' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టింది. దీంతో శోభిత కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ నటిగా నిలిచింది. సినిమాలతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ, మరోవైపు భారతీయ చేనేత కళను ప్రోత్సహిస్తూ సంప్రదాయం, ఆధునికత మధ్య వారధిలా నిలుస్తోంది. ఆమె స్టైల్, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
ఇక వ్యక్తిగత జీవితంలో నాగ చైతన్యతో ఆమె ప్రేమ, వివాహం కూడా చాలా కాలం వార్తల్లో నిలిచింది. కొంతకాలం ప్రేమలో ఉన్న ఈ జంట 2024 డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటైంది. అప్పటి నుంచి అక్కినేని కుటుంబంలో పెద్ద కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, మరోవైపు కెరీర్పై కూడా పూర్తి దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం శోభిత మంచి కథల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె త్వరలో తన సినిమాలను ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు నాగ చైతన్య కూడా కెరీర్ పరంగా మంచి జోష్లో ఉన్నాడు. 'తండేల్' విజయంతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన ఆయన, ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వృషకర్మ' చిత్రంలో నటిస్తున్నాడు. మైథాలజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ జంట.. వ్యక్తిగత జీవితంలోనూ ఒకరికొకరు అండగా నిలుస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications





