Naga Shaurya: ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్.. టాలీవుడ్లో నాగశౌర్య అరుదైన రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది స్వయంకృషితో ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే టాలెంట్ను చూపించి రాణించగలుగుతున్నారు. తద్వారా హిట్లను అందుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఈ సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్ను సైతం అందుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించాడు. అయితే, ఇవి అతడికి వర్కౌట్ కాలేదు. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన చిత్రాలను ట్రై చేస్తున్నాడు.
గత సంవత్సరం 'అశ్వద్థామ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. క్రైమ్ థ్రిల్లర్గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ఈ ఏడాది రెండు సినిమాల్లో నటించాడు. అందులో ఒకటి లక్ష్మీ సౌజన్య అనే మహిళా దర్శకురాలు తెరకెక్కించిన 'వరుడు కావలెను' మూవీ ఒకటి. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీలో రితూ వర్మ హీరోయిన్గా నటించింది. ఇందులో మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు నటించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

'వరుడు కావలెను' సినిమా ఎక్కువ థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. ఆరంభంలో మంచి టాక్ వచ్చినా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఇది విఫలం అయింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలే ఎదురయ్యాయి. ఇక, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ZEE5 సంస్థ సొంతం చేసుకుంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీ నుంచి అందులో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ఇక, ఈ ఏడాది హీరో నాగశార్య నటించిన మరో సినిమా 'లక్ష్య'. దీన్ని ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగశౌర్య అర్చరీ క్రీడాకారుడిగా నటించాడు. ఇందులో అతడు ఎనిమిది పలకల దేహంతో కనిపించాడు. భారత చలన చిత్ర చరిత్రలోనే అర్చరీ నేపథ్యంతో రూపొందిన మొట్టమొదటి సినిమా అయిన దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్గా చేసింది. కాల భైరవ దీనికి సంగీతం అందించాడు. ఇది కూడా కొద్ది రోజుల క్రితమే గ్రాండ్గా విడుదలైంది.

'లక్ష్య' మూవీపై అందరిలో ఆసక్తి పెరిగిపోవడంతో బిజినెస్ మంచిగానే జరిగింది. కానీ, ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో నిర్మాతలకు రూ. 4.42 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'లక్ష్య' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్పై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. దీనిపై ప్రకటనను వదిలింది. నాగశౌర్య నటించిన ఈ సినిమాను జనవరి 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సదరు సంస్థ తాజాగా అనౌన్స్ చేసింది. అంటే ఒకరోజు నాగశౌర్య నటించిన రెండు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.


Click it and Unblock the Notifications











